
సోలార్ నిర్మాణ పనులు అడ్డుకున్న రైతులు
ఎన్పీకుంట: పరిహారం చెల్లించేవరకూ తమ భూముల్లో సోలార్ ప్రాజెక్ట్ పనులు చేపట్టరాదంటూ సోమవారం నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. ఎన్పీకుంట మండలం పెడబల్లి పంచాయతీలో ఎన్హెచ్పీసీ, ఇలియోస్ పవర్ కంపెనీ వారు చేపట్టిన నూతన సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భూములు కోల్పోయిన పలువురు రైతులకు ఇప్పటి వరకూ పరిహారం అందలేదు. దీంతో తమకు పరిహారం చెల్లించిన తరువాతనే పనులు చేపట్టాలని బాధిత రైతులు నిర్మాణ పనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సోలార్ నిర్మాణం కోసం భూ సేకరణ చేసే సమయంలో ఎకరాకు రూ.5లక్షలు పరిహారం చెల్లిస్తామని తెలిపారన్నారు. ఇందులో కొందరు రైతులకు భూమికి బదులు భూమి ఇస్తామని, అలాగే ఉలవ పంట సాగు చేసిన రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఒక్క రూపాయి చెల్లించకుండా మోసం చేశారని వాపోయారు. సోలార్ ప్రాజెక్టు వలన ఇక్కడి రైతులకు, నిరుద్యోగ యువతకు ఎలాంటి ప్రయోజనం లేదని ధ్వజమెత్తారు. తమ భూములకు పరిహారం చెల్లించిన తరువాతనే పనులు చేపట్టాలని, అలాకాకుండా దౌర్జన్యంగా పనులు చేపడితే ఎంతవరకై నా పోరాటానికి తాము సిద్ధమని హెచ్చరించారు.