
‘పాలిసెట్’ పకడ్బందీగా నిర్వహించాలి
ప్రశాంతి నిలయం: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం ఈనెల 30న జిల్లాలో జరిగే ‘పాలిసెట్–2025’ పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్ఓ విజయసారథి ఆదేశించారు. పాలిసెట్ పరీక్ష నిర్వహణపై శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంఽధిత శాఖల అధికారులతో డీఆర్ఓ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధర్మవరం, కదిరి, హిందూపురం పాలిటెక్నిక్ కళాశాలల పరిధిలోని 15 కేంద్రాల్లో పరీక్ష ఉంటుందన్నారు. జిల్లాకు చెందిన 5,326 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని వెల్లడించారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకూడదన్నారు. ఇన్విజిలేటర్లు కూడా సెల్ఫోన్లు వాడకూడదన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలన్నారు. కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఒక్క నిమిషం దాటినా పరీక్షకు అనుమతించం
పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఉంటుందని, అభ్యర్థులు 10 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని డీఆర్ఓ సూచించారు. 11 గంటల తర్వాత ఒక్క నిముషం దాటినా పరీక్షకు అనుమతించబోమన్నారు. సమావేశంలో పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం, కదిరి, హిందూపురం పాలిటెక్నికల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు రమ, హరీష్, అసిస్టెంట్ కో ఆర్డినేటర్ బాలస్వామి, ఆర్టీసీ డీఎం ఇనాయతుల్లా, ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్, హిందూపురం తహసీల్దార్ మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా నుంచి 5,326 మంది
దరఖాస్తు.. 15 కేంద్రాల ఏర్పాటు
డీఆర్ఓ విజయసారథి