
రైతుకు తీరని నష్టం
ధర పతనం..
పుట్టపర్తి అర్బన్: వేసవిలో ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించే కళింగర, దోస పంటలు రైతులను నట్టేట ముంచాయి. ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుని ఆరుగాలం శ్రమించి పండించిన పంట కాస్త చేతికి రాగానే ధరల పతనంతో తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. స్థానికంగా మార్కెటింగ్ సదుపాయం కూడా లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోలేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చివరకు కిలో కళింగర, దోస కాయలను రూ.5 చొప్పున విక్రయించేందుకు సిద్ధమైన కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో పంట పొలాల్లోనే దిగుబడులు వదిలేసిన దైన్య స్థితి.
323 హెక్టార్లలో సాగు..
జిల్లాలో ఏటా వంద హెక్టార్లలో కూడా సాగు చేయని కళింగర, దోస పంటలను ఈ సారి రైతులు ఏకంగా 323 హెక్టార్లలో సాగు చేయడం విశేషం. ఇందులో 118 హెక్టార్లలో కళింగర, మరో 205 హెక్టార్లలో దోస సాగు చేశారు. పంటల సాగుకు ఎకరాకు సుమారు రూ. లక్ష వరకూ ఖర్చు చేశారు. భూమి దుక్కి చేయడం మొదలు.. విత్తనాలు, మల్చింగ్ షీట్, ఎరువులు, డ్రిప్పు ఎరువులు, మందుల పిచికారీ, తొలగించే వరకూ కూలీల ఖర్చులు తడిసి మోపడయ్యాయి. అవగాహన లోపంతో ఉద్యాన అధికారులు, ఫర్టిలైజర్ షాపు యజమానులు, తోటి రైతులు చెప్పిన మందులు, ఎరువులకు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేశారు. తీరా పంట చేతికి వచ్చే సమయంలో వైరస్కు తోడు వేసవి ఎండల తాకిడికి పంట పొలాల్లోనే కాయల్లో పగుళ్లు వచ్చాయి. అష్టకష్టాలు పడి నాణ్యమైన కాయలను వేరు చేసి మార్కెట్కు తరలించేలోపు కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ముందస్తుగానే కళింగర కాయలు ఇబ్బడి ముబ్బడిగా దిగుమతి అయ్యాయి. దీంతో ఇక్కడి పంటలకు గిట్టుబాటు ధర లభించలేదు. చివరకు కొందరు వ్యాపారులు కిలో రూ.5 నుంచి రూ.7 చొప్పున కొనుగోలుకు ముందుకు వచ్చారు. ఈ ధరతో పంటను విక్రయిస్తే కనీసం కూలీల ఖర్చులు కూడా గిట్టుబాటు కాదని భావించిన పలువురు రైతులు దిగుబడులను పొలాల్లోనే వదిలేశారు. రైతుల బలహీనతను ఆసరాగా చేసుకున్న మరికొందరు వ్యాపారులు కళింగరను కిలో రూ.3, దోసను కిలో రూ.7 చొప్పున కొనుగోలు చేస్తామంటున్నారు. దీంతో రైతులు పంటను రోడ్డు పక్కన పడేసి తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నట్టేట మునిగిన కళింగర, దోస రైతులు పెట్టుబడి సైతం చేతికి అందక ఇబ్బందులు కిలో రూ.5 చొప్పున కూడా అమ్ముడుపోని దిగుబడులు

రైతుకు తీరని నష్టం

రైతుకు తీరని నష్టం