
పుట్టపర్తి అర్బన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు విద్య, ఉద్యోగం తదితర అవసరాలకు కుల ధ్రువీకరణ పత్రాలు చాలా కీలకంగా మారాయి. అయితే వీటి జారీలో ఇప్పటి వరకూ సవాలక్ష నిబంధనల కారణంగా ఆయా వర్గాల వారు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఈ పరిస్థితిని గమనించిన జగనన్న సర్కార్.. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీలో సడలింపులు తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఇప్పటికే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టి అర్హులైన వారికి వారి ఇంటి ముంగిటకే ధ్రువీకరణ పత్రాలను అందజేసింది. అంతటితో ఆగకుండా ఒక్కసారి కుల ధ్రువీకరణ పత్రాన్ని పొందితే దానిని శాశ్వత పత్రంగా పరిగణిచాలంటూ అన్ని ప్రభుత్వ శాఖలకూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీకి సచివాలయాల పరిధిలోని ఆరు దశల తనిఖీ సరిపోతుందని స్పష్టం చేసింది.
ఒరిజినల్ పోతే.. అదే నంబర్తో కొత్తది
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో కుల ధ్రువీకరణ పత్రాన్ని ఒక్కసారి పొందితే చాలు దానిని శాశ్వత పత్రంగా పరిగణించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రజలు పొందిన సర్టిఫికెట్ ఎక్కడైనా పోగొట్టుకుని పోతే వాటి కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసువాల్సిన అవసరం లేదు. ఇందుకు సంబంధించి గతంలో పొందిన సర్టిఫికెట్ నకలు ఉంటే దానిని తీసుకెళ్లి సచివాలయం, మీసేవ కేంద్రం, సీఎస్పీ సెంటర్లలో చూపడంతో ద్వారా అదే నంబర్తో కొత్త సర్టిఫికెట్ను వెంటనే అందజేస్తారు. ఇందు కోసం కొత్తగా ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. అలాగే కుటుంబంలో గతంలో ఎవరూ ఎలాంటి సర్టిఫికెట్ పొంది ఉండకపోతే దరఖాస్తుదారు ప్రస్తుతం ఈ–కేవైసీ చేయించుకుని తహసీల్దార్ ద్వారా ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తుదారు ఈ–కేవైసీ చేయించుకుని సర్టిఫికెట్ పొంది ఉంటే అతని రక్త సంబంధీకులు ఎవరైనా ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు.
జగనన్న సురక్షలో లక్షలాది సర్టిఫికెట్లు:
గత జూన్–జులై మాసాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ఎవరికి ఏ సర్టిఫికెట్ అవసరమో గుర్తించి వాటిని గ్రామ సభల్లో అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల కుటుంబాలను సర్వే చేసి, 4,80,439 మందికి నిర్ణీత గడువు లోపు సర్టిఫికెట్లు అందజేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఇందులో అత్యధికంగా కుల, ఆదాయ, నివాసాలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉండడం గమనార్హం. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ఇవన్నీ శాశ్వత సర్టిఫికెట్లుగా గుర్తించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఒక్కసారి తీసుకుంటే చాలు
ఎవరైనా ఒక్కసారి కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను పొందితే చాలు. వాటిని శాశ్వత ధ్రువీకరణ పత్రాలుగా పరిగణిస్తాం. కొత్త సర్టిఫికెట్ కోసం ఒత్తిడి చేకూడదని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సైతం ఆదేశాలు జారీ చేశాం. – అరుణ్బాబు, కలెక్టర్
కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు ఒక్కసారి పొందితే చాలు
ఒరిజినల్ పోయినా అదే నంబర్పై కొత్త సర్టిఫికెట్
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం