
అసంపూర్తిగా నాడు–నేడు పనులు
రెండో విడత నాడు–నేడులో భాగంగా జిల్లాలో 1,356 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. వీటితోపాటు అంగన్వాడీలు, డైట్, బీఈడీ కళాశాలను కూడా ఎంపిక చేశారు. వీటిల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.466.94 కోట్లు నిధులు మంజూరు చేశారు. రూ.190.45 కోట్లు నిదులు విడుదల చేశారు. ఈ నిధులతో కొన్ని పాఠశాలల్లో నిర్మాణాలను పూర్తి చేయగా కొన్నింట్లో నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. ఆ తర్వాత సాధారణ ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ పనులకు నిధులు ఉన్నప్పటికీ ఇంకా 554 టాయిలెట్స్కు తలుపులు బిగించలేదు. 250 కిచెన్ షెడ్లు, 485 తరగతి గదులు, 319 టాయిలెట్స్, 220 ఇంగ్లిష్ ల్యాబ్లు, పనిచేయని మెజార్టీ ఆర్వో ప్లాంట్లు తదితర వాటిల్లో అసంపూర్తిగా పనులు మిగిలిపోయాయి. కనీసం మరమ్మతులకు గురైన వాటిని కూడా బాగు చేయని పరిస్దితి ఉంది. పాఠశాలలను పునః ప్రారంభిస్తే విద్యార్థులకు చెట్లు కింద తరగతి గదులు నిర్వహించాల్సి ఉంటుంది.
అరకొరగా స్టూడెంట్స్ కిట్స్
పాఠశాలల పునః ప్రారంభం తర్వాత విద్యార్థులకు అందించాల్సిన స్టూడెంట్స్ కిట్స్ జిల్లాకు అరకొరగానే వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో తొలిరోజే విద్యార్థులకు విద్యాకానుక అందజేసిన పరిస్థితి ఉంది. నేటికి యూనిఫాం, బూట్లు, సాక్స్లు ఒకటి కూడా జిల్లాకు రాని పరిస్థితి ఉంది. కొన్ని అరకొరగానే వచ్చాయి. పాఠశాలల పునః ప్రారంభం రోజును విద్యార్థులకు పూర్తి స్థాయిలో స్టూడెంట్స్ కిట్స్ను అందజేసే పరిస్థితి లేదు.