
ఎర్ర జెండాలు చేతపట్టి.. మేడే ప్రదర్శన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నెల్లూరు బోసుబొమ్మ సెంటర్ నుంచి ట్రంకురోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. నాయకులు, కార్మికులు ఎరుపు రంగు దుస్తులు ధరించి, అరుణ పతాకాలు చేతపట్టి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలోని చాలీచాలని వేతనాలతో కష్టజీవులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలు, హక్కులను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చి కార్మికుల పొట్ట కొడుతూ బడా పారిశ్రామికవేత్తల కడుపు నింపుతోందని ఆరోపించారు. పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్న హక్కులను మరింత మెరుగుపరచాల్సింది పోయి అందుకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మికుల జీవనస్థితిని దిగజార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మేడేను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి కార్మికుడు పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో నాయకులు మూలం రమేష్, నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, అజయ్ కుమార్, రెహానా బేగం, కొండా ప్రసాద్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రదర్శనలో పాల్గొన్న నేతలు

ఎర్ర జెండాలు చేతపట్టి.. మేడే ప్రదర్శన