
న్యూఢిల్లీ టెస్ట్లో విండీస్ బ్యాటర్లు అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించారు. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్లో ఊహించని రీతిలో ప్రతిఘటించారు.
తొలుత జాన్ క్యాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల టార్గెట్ను ఉంచారు.
గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.
కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.
చదవండి: IND VS WI 2nd Test: చెలరేగిపోతున్న మియా భాయ్..!