MI Vs RR: ముంబై ఎట్టకేలకు భోణీ .. రోహిత్‌కు బర్త్‌డే కానుక

Mumbai Indians Beat Rajasthan Royals By 5 Wickets 1st Victory IPL 2022 - Sakshi

ముంబై: హమ్మయ్య... ఎట్టకేలకు ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌ ఐపీఎల్‌లో గెలుపు బోణీ చేసింది. తొలి ఎనిమిది మ్యాచ్‌లనూ ఓడి దాదాపు అచేతనంగా కనిపించిన ‘ఐదుసార్లు చాంపియన్‌’ చివరకు తొమ్మిదో మ్యాచ్‌లో గెలుపు రుచి చూసింది. ముందుగా పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన టీమ్‌ ఆ తర్వాత సూర్య, తిలక్‌ వర్మ భాగస్వామ్యంతో గెలుపు దిశగా సాగింది.

చివర్లో కొంత ఉత్కంఠ ఎదురైనా... మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకొని తమ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ముంబై సహచరులు పుట్టిన రోజు కానుక అందించారు. శనివారం జరిగిన పోరులో ముంబై 5 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. ముందుగా రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. జోస్‌ బట్లర్‌ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆఫ్‌స్పిన్నర్‌ హృతిక్‌ షౌకీన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో బట్లర్‌ వరుసగా 6, 6, 6, 6 బాదాడు. ఐదో బంతికి పరుగు రాకపోగా, ఆరో బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు.

అనంతరం ఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సూర్యకుమార్‌ (39 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడగా, తిలక్‌ వర్మ (30 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. సూర్య, తిలక్‌ మూడో వికెట్‌కు 56 బంతుల్లో 81 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. చివర్లో టిమ్‌ డేవిడ్‌ (9 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టును విజయతీరానికి చేర్చాడు.  

చదవండి: IPL 2022: జడేజా సంచలన నిర్ణయం.. సీఎస్‌కే కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top