ఐపీఎల్-2026 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామోరాన్ గ్రీన్పై కాసుల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. గ్రీన్ను కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.25.5 కోట్ల భారీ ధర వెచ్చించి మరి సొంతం చేసుకుంది. దీంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది.
ఈ ఏడాది సీజన్లో గ్రీన్ ఎలా రాణిస్తాడో అని ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గ్రీన్ను అంత భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయడాన్ని బద్రీనాథ్ తప్పుబట్టాడు.
కేవలం హైప్ వల్లే గ్రీన్ అంత భారీ ధరకు అమ్ముడయ్యాడని, అంతే తప్ప అతడేమి పెద్ద క్రికెటర్ కాదని ఈ సీఎస్కే మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. కాగా గ్రీన్ ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. యాషెస్ సిరీస్తో పాటు ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్లోనూ గ్రీన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.
ఈ నేపథ్యంలో బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "గ్రీన్ను వేలంలో రూ.25 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అతడేమో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా తరపున అతడు ఎలా ఆడాడో చూశాం.
కేవలం అతడిపై ఉన్న హైప్ కారణంగానే అంత భారీ ధరకు అమ్ముడయ్యాడు. వాస్తవానికి అతడు అంత విలువైన క్రికెటర్ కాదు. ఐపీఎల్లో అతడు ఒంటిచేత్తో గెలిపించిన మ్యాచ్ ఒక్కటైనా ఉందా? ఆస్ట్రేలియా ఆటగాళ్లపై ప్రతీసారి అనవసరమైన హైప్ సృష్టిస్తారు.
ఇప్పుడు గ్రీన్ విషయంలో కూడా అదే జరిగింది. కేకేఆర్ మాత్రం అతడిపై అంత భారీ మొత్తాన్ని వెచ్చించి తప్పు చేసింది అని పేర్కొన్నాడు. కాగా గ్రీన్ గతంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. అయితే గాయం కారణంగా గత సీజన్కు గ్రీన్ దూరమయ్యాడు. తర్వాత తన పునరాగమనంలో గ్రీన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక ఐపీఎల్-19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IPL 2026: 'సెహ్వాగ్ను చూసి నేర్చుకో'.. అభిషేక్కు కుంబ్లే వార్నింగ్


