వార్సా (పోలండ్): సూపర్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ను భారత ఆటగాడు గుకేశ్ దొమ్మరాజు ఆరో స్థానంతో ముగించాడు. ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ కలిపి అతను మొత్తం 17 పాయింట్లు సాధించాడు. ర్యాపిడ్ విభాగంలో 9 పాయింట్లు సాధించిన గుకేశ్ బ్లిట్జ్లో 8 పాయింట్లు మాత్రమే రాబట్టగలిగాడు. ఈ టోర్నమెంట్లో అమెరికాకు చెందిన హన్స్ నీమన్ విజేతగా నిలిచాడు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో కలిపి మొత్తం 22.5 పాయింట్లు సాధించిన నీమన్ 50 వేల డాలర్ల బహుమతిని సొంతం చేసుకున్నాడు.
శనివారం 9 బ్లిట్జ్ రౌండ్లలో బరిలోకి దిగిన గుకేశ్... 3 రౌండ్లలో గెలవగా, 4 రౌండ్లలో ఓటమిని ఎదుర్కొన్నాడు. మరో 2 రౌండ్లు డ్రాగా ముగిశాయి. వెస్లీ సో (అమెరికా), నీమన్ (అమెరికా), జాన్ డ్యూడా (పోలండ్)లపై విజయం సాధించిన గుకేశ్...అలీరెజా ఫిరోజ్ (ఫ్రాన్స్), వ్లదీమర్ ఫెడోసీవ్ (రష్యా), ఫాబియో కరువానా (అమెరికా), సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతుల్లో పరాజయంపాలయ్యాడు. వొటాజెక్ (పోలండ్), మ్యాగ్జిమ్ లాగ్రేవ్ (ఫ్రాన్స్)లతో అతని ఆట సమంగా ముగిసింది. 16వ రౌండ్లో గుకేశ్ చేతిలో ఓడినా... కోలుకొని చివరకు నీమన్ చాంపియన్గా నిలవడం విశేషం.


