ఇంగ్లండ్తో మూడో టీ20లో టీమిండియా ఘోర పరాజయం అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై అభిమానుల ఆగ్రహం వ్యక్తమైంది. నాటింగ్హమ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం వెలుపల భారత జట్టు బయలుదేరుతున్న సమయంలో అభిమానులు "వీ వాంట్ సంజూ" అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సంజూ శాంసన్ను జట్టులోకి తిరిగి తీసుకోవాలంటూ గంభీర్ను లక్ష్యంగా చేసుకుని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
‘We want Sanju’ chants outside the stadium when team India leaves. pic.twitter.com/bzqljBakTG
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 8, 2026
ఐర్లాండ్ సిరీస్లో రెండు మ్యాచ్ల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన సంజూ శాంసన్, ఇంగ్లండ్తో తొలి టీ20లో కూడా ఒక్క పరుగు మాత్రమే చేయడంతో జట్టు యాజమాన్యం అతడిని తప్పించింది. అతని స్థానంలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించింది.
అయితే ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో సంచలన ప్రదర్శనలతో భారీ అంచనాలు పెంచుకున్న వైభవ్ సూర్యవంశీ కూడా ఇంగ్లండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. మూడో టీ20లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో సంజూను తప్పించి వైభవ్కు అవకాశం ఇవ్వడంపై అభిమానులు ప్రశ్నలు లేవనెత్తారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు బస్సు వైపు వెళ్తున్న సమయంలో గౌతమ్ గంభీర్, తిలక్ వర్మతో పాటు ఆటగాళ్లు స్టేడియం వెలుపల అభిమానుల నినాదాల మధ్య బయటకు వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఇదిలా ఉంటే, సంజూ శాంసన్కు జట్టు తలుపులు పూర్తిగా మూసేయలేదని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "సంజూ శాంసన్ మళ్లీ జట్టులోకి రాకూడదనే ఎలాంటి నిబంధన లేదు. ప్రతి ఆటగాడు తన స్థానాన్ని తన ప్రదర్శనతో సంపాదించుకోవాలి" అని వ్యాఖ్యానించాడు.


