WPL Auction: మహిళల ఐపీఎల్‌ వేలం​ నిర్వహించనున్న ఈమె ఎవరో తెలుసా..?

Details About WPL Auctioneer Mallika Sagar Advani     - Sakshi

మహిళల ఐపీఎల్‌ (WPL) తొట్టతొలి వేలాన్ని నిర్వహించేందుకు మల్లిక సాగర్‌ అడ్వానీ అనే మహిళను బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. ఇనాగురల్‌ WPL యొక్క వేలం ఇవాళ (ఫిబ్రవరి 13) ముంబైలో జరుగనుంది. ఈ నేపథ్యంలో వేలం నిర్వహించనున్న మల్లిక గురించి తెలుసుకునేందుకు క్రికెట్‌ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.

ముంబైకి చెందిన మల్లిక అడ్వానీ పురాతన పెయింటింగ్స్‌ (ఆర్ట్)ను సేకరించే వృత్తిలో ఉన్నారు. ఆమె మోడ్రన్‌ అండ్‌ కాన్‌టెంపరరీ ఇండియన్‌ ఆర్ట్‌ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్‌ కలెక్టర్‌ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. అలాగే ఆమె ఆర్ట్‌ ఇండియా కన్సల్టెంట్స్‌ ఫర్మ్‌లో పార్ట్‌నర్‌గా కూడా ఉన్నారు. ఆక్షన్‌లు నిర్వహించడంలోనూ మల్లికకు పూర్వ అనుభవం ఉంది.

పుండోల్స్‌ అనే ముంబై బేస్డ్‌ సంస్థ తరఫున వైవిధ్యభరితంగా వేలం నిర్వహించి గతంలో ఆమె వార్తల్లోకెక్కారు. క్రీడలకు సంబంధించిన వేలం నిర్వహణలోనూ మల్లికకు ప్రవేశం ఉంది. 2021 ప్రో కబడ్డీ లీగ్‌ వేలాన్ని ఆమె సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. వృత్తి రిత్యా మల్లికకు సంబంధించిన వివరాలు ఇవి. కాగా, పురుషుల ఐపీఎల్‌ వేలం ప్రక్రియను గతంలో హగ్‌ ఎడ్మియాడెస్‌, రిచర్డ్‌ మ్యాడ్లీ లేక చారు శర్మ నిర్వహించిన విషయం తెలిసిందే. మహిళల లీగ్‌ కోసం మహిళా ఆక్షనీర్‌ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో బీసీసీఐ మల్లిక పేరును కొద్ది రోజుల కిందటే తెరపైకి తెచ్చింది. 

ఇదిలా ఉంటే, ఇవాళ జరుగబోయే WPL వేలంలో మొత్తం 409 మంది మ‌హిళా క్రికెట‌ర్లు పాల్గొననుండగా.. కేవలం 90 స్లాట్స్ మాత్ర‌మే ఖాళీగా ఉన్నాయి. లీగ్‌లో పాల్గొనబోయే 5 జట్లు కనీసం 15 మంది ప్లేయర్లను కొనుగోలు చేస్తాయి. ఆయా ఫ్రాంచైజీలు ప్లేయర్ల కోసం 9 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫుల్‌ పర్స్‌ వ్యాల్యూ 12 కోట్లుగా ఉంది. ఒక్కో జట్టుకు కేవలం ఆరుగురు ఫారిన్‌ ప్లేయర్లను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

వేలంలో పాల్గొంటున్న క్రికెటర్లలో 24 మంది 50 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌కు, 30 మంది 40 ల‌క్ష‌ల బేస్ ప్రైజ్‌ విభాగంలో పేర్తు రిజిస్టర్ చేసుకున్నారు. 50 లక్షల విభాగంలో ఉన్నప్లేయర్లలో హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానా, దీప్తి శ‌ర్మ‌, షెఫాలీ వ‌ర్మ వంటి భార‌త క్రికెట‌ర్లు.. ఎలైస్‌ పెర్రీ(ఆస్ట్రేలియా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), సోఫీ డెవినె (న్యూజిలాండ్), డియాండ్ర డొటిన్ (వెస్టిండీస్) వంటి విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వేలం ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభంకానుంది. ముంబై వేదిక‌గా మార్చి 4 నుంచి WPL మొద‌లు కానుంది. ఐదు జ‌ట్లు 22 మ్యాచ్‌లు ఆడ‌తాయి. మార్చి 22న ఫైన‌ల్ జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top