T20 World Cup: ఒమన్‌లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లపై ప్రభావం..!

Cyclone Shaheen Almost Forced Oman To Wave Goodbye To T20 World Cup - Sakshi

Cyclone Shaheen Almost Forced Oman To Wave Goodbye To T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌కు ఆతిధ్య దేశమైన ఒమన్‌లో షహీన్‌ తుఫాను బీభత్సం సృష్టించింది. వేగవంతమైన గాలులు, అతి భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని మస్కట్‌ సహా చుట్టు పక్క ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. ఈ ప్రభావం ఇక్కడ జరగాల్సిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లపై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుఫాను నేపథ్యంలో క్వాలిఫయర్స్‌ (శ్రీలంక, ఐర్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్, బంగ్లాదేశ్, నమీబియా, నెదర్లాండ్స్, స్కాట్లాండ్‌) జట్ల మధ్య జరగాల్సిన 6 రౌండ్‌-1 మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలను ఐసీసీ తాత్కాలికంగా నిలిపేసింది.  మరోవైపు యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాల్లో జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల అమ్మకం యధావిధిగా కొనసాగుతోంది.  

ఇదిలా ఉంటే, క్వాలిఫయర్స్‌ జట్ల మధ్య రౌండ్-1 మ్యాచ్‌లు అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీలంక, ఐర్లాండ్ జట్లు టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. కరోనా నేపథ్యంలో ఒమన్ ప్రభుత్వం 70 శాతం మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే తప్పనిసరిగా రెండు డోస్‌ల వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే స్టేడియాల్లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, మేజర్‌ జట్ల మధ్య సూప‌ర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్‌ 23 నుంచి ప్రారంభమవుతాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌తో రసవత్తర పోరు మొదలవుతుంది. ఈ టోర్నీలో టీమిండియా లీగ్‌ దశలో తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్‌ 24న పాక్‌తో, అక్టోబర్‌ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్‌ 3న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
చదవండి: ధోని ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఫేర్‌వెల్‌ గేమ్‌ అక్కడే..!
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top