ప్రభుత్వ తీరుపై మత్స్యకారుల ఆగ్రహం
సిద్దిపేటఅర్బన్: ఉచిత చేప పిల్లల పంపిణీని సకాలంలో చేపట్టాలని, వానాకాలం సీజన్ ముగిసే దశలో చేప పిల్లలను వదలడం ద్వారా తమకు ఏ ఉపయోగం ఉండదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలోని ముదిరాజ్ ఫంక్షన్ హాలులో జిల్లా స్థాయి మత్స్యకారుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏయే పథకాలు అమలు చేస్తుందో అధికారులు తెలియజేయకుండా చెప్పకుండా చెరువులు, కుంటలు, సొసైటీల, సభ్యుల లెక్కలు చెప్తే ఏం లాభమని వాపోయారు. గత సీజన్లో సరైన సమయంలో చెరువులు, కుంటలలో చేప పిల్లలను ఎందుకు వదలలేదని ప్రశ్నించారు. ఈ సారైనా ప్రభుత్వం సకాలంలో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయాలని, అన్ని చెరువులు, కుంటల్లో వదిలే విధంగా ప్రతిపాదనలు పంపాలని కోరారు. కార్యక్రమంలో నోడల్ అధికారి డీఏఓ స్వరూపరాణి మాట్లాడుతూ.. మత్స్యకారుల సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ గౌతమి, మత్స్య సొసైటీ సభ్యులు, నాయకులు జంగిటి శ్రీనివాస్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.


