ములుగు(గజ్వేల్): మండల కేంద్రమైన ములుగులో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చైల్డ్ హెల్ప్ లైన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గణేశ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ రంజిత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హరీశ్, పోలీస్ శాఖల సిబ్బందితో కూడుకున్న బృందం గురువారం గ్రామానికి చేరుకున్నది. బాల్య వివాహం చేయడం ద్వారా జరిగే అనర్థాలు, చట్టాలపై ఇరు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. బాలిక వయస్సు 16 ఏళ్ల కారణంగా యుక్త వయస్సు వచ్చేవరకు పెళ్లి చేయరాదని కుటుంబ సభ్యుల వద్ద నుంచి లిఖితపూర్వకంగా రాసుకున్నారు. బాలల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాల్యవివాహాల ను అరికట్టేందుకు సహకరించాలని కోరారు.


