
రేవంత్కు మాటలెక్కువ చేతలు తక్కువ
వర్గల్(గజ్వేల్): రేవంత్ సర్కార్కు మాటలెక్కువ, చేతలు తక్కువ అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రోడ్లకు గుంతలు పడితే తట్టెడు మన్నుపోసే పరిస్థితిలేదని, కొత్తవి ఏం రాలేదని, పాత పథకాలకు కోతలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లివస్తూ ప్రమాదానికి గురై మృతి చెందిన తున్కిమక్తలోని చాకలి కనకయ్య కుటుంబాన్ని ఆదివారం కలిశారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వేలూరు వెంకట్రెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షురాలు సంతోషతో కలసి భార్య, పిల్లలను పరామర్శించారు. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ తరపున రూ.5 లక్షల చెక్కును అందజేశారు. కనకయ్య మృతి బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తామని, ఇళ్లు నిర్మింపజేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలకులు అబద్ధపు మాటలతో పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. వానాకాలం రైతుబంధు పడనేలేదన్నారు. ఇచ్చింది కొసరంత, చెప్పేది కొండంత అంటూ దుయ్యబట్టారు. ప్రభుత్వ ఆస్పత్రులలో టార్చ్లైట్లు పెట్టుకుని ఆపరేషన్ చేస్తున్న దుస్థితి దాపురించిందని, ఆసుపత్రుల్లో మందులు, సూదులు లేవని, జెనరేటర్లకు డీజిల్ కరువైందన్నారు. రూ.30 కోట్లతో గజ్వేల్లో వంద పడకల మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి ప్రారంభిస్తే, దానిని వినియోగంలోకి తేవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగరాజు, మాదాసు శ్రీనివాస్, బాలూ యాదవ్, వెంకటేష్గౌడ్, కృష్ణారెడ్డి, రమేష్గౌడ్, భీంరెడ్డి, భాస్కర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్లకు గుంతలు పడితే
తట్టెడు మన్ను పోస్తలేరు
మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు
తున్కిమక్తలో మృతుడి
కుటుంబీకుల పరామర్శ