4 క్వింటాల గంజాయి స్వాధీనం
● పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు ● వివరాలు వెల్లడించిన శేరిలింగంపల్లి జోన్ డీసీపీ
పటాన్చెరు టౌన్: అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి, 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో శేరిలింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఎస్ఓటి డీసీపీ శోభన్ కుమార్తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్న టీమ్ కూకట్పల్లి జోన్, పటాన్న్చెరు పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు ముత్తంగి ఓఆర్ఆర్ వద్ద సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డీసీఎంలో 400 కిలోల గంజాయిని లోడ్ చేసి, పైభాగంలో ఖాళీ కూరగాయల ప్లాస్టిక్ ట్రేలను ఉంచి రహస్యంగా తరలిస్తున్నారు. అలాగే డీసీఎంకు ఎర్టిగా కారు ఎస్కార్ట్ ఏర్పాటు చేసి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన వారు మహారాష్ట్రకు చెందిన బాలాజీ గణేశ్ హోన్మాని, రోహిత్ హోవాల్, ఆనంద్ మాయప్ప, ప్రతాప్ హరిదాస్ పవార్, చంద్రశివ్ ఆడుంబర్, చంద్రశివ్ సహిల్,రంజిత్ రాజేందర్ అలియాస్ గోవింద్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా మహారాష్ట్రకు చెందిన మనీషా పద్వాల్, ఒడిశాకు చెందిన ట్రిబ్యూన్ గంజాయి సరఫరా చేస్తున్నారని పోలీసుల విచారణలో తెలిసింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.2 కోట్లు 15 లక్షల 60 వేలు ఉంటుందని తెలిపారు. డీసీఎం, ఎర్టిగా కారు, 6 ఫోన్లను స్వాధీనం చేసుకొని, ఏడుగురు నిందితులను రిమాండ్కు తరలించారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. ఎస్ఓటి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్, పటాన్చెరు సీఐ వినాయక్ రెడ్డి, క్రైమ్ సీఐ రాజు, పోలీసు బృందాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించారు.


