కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి టౌన్: ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ అవసరాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అలవర్చుకుని పరిస్థితులకనుగుణంగా వ్యవసాయం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. డిమాండ్ ఉన్న, లాభదాయకమైన పంటలను సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులతోపాటు మెరుగైన లాభాలు పొందవచ్చన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాల్లో భాగంగా గురువారం సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో వ్యవసాయ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. రైతులు తమ భూములకు అనుకూలమైన పంటలనే సాగు చేయాలన్నారు. పంటల సాగుతోపాటు విలువ ఆధారిత ఉత్పత్తులపై కూడా రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. జహీరాబాద్, సదాశివపేట, వట్పల్లి ప్రాంతాల్లో జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొందరు రైతులు కోరగా, ఆ దిశగాచర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అనంతరం రైతులకు సబ్సిడీపై అందజేస్తున్న డ్రోన్లు, కట్టర్లు, స్ప్రేయర్లు తదితర వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం తీసుకుంటున్న చర్యలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల వద్ద పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులు, ఏవోలు, ఏఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి
సంగారెడ్డి జోన్: జిల్లాలో పరిశ్రమల ప్రాంతాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో ఎస్పీ పరితోశ్ పంకజ్తో కలిసి జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో వరదలు, పరిశ్రమల ప్రమాదాలు, అటవీ అగ్నిప్రమాదాల నియంత్రణ, విపత్తుల సమయంలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అగ్నిమాపక శాఖ, పరిశ్రమల శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, రవాణా శాఖ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), మున్సిపల్ శాఖ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.


