
● రెవెన్యూ సదస్సుల్లో వచ్చినఅర్జీల్లో ఇవే అధికం ● ఆయా స
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భూభారతి అమలులో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించిన దరఖాస్తులే అధికంగా ఉన్నాయి. మూడో వంతు అర్జీలు ఈ కేటగిరికి చెందినవే ఉన్నాయి. వీటి పరిష్కారం రెవెన్యూశాఖకు సవాల్గా మారింది. టీఎం–33 మాడ్యుల్ కింద వీటిని పరిష్కరించేందుకు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ దరఖాస్తులను పరిష్కరించాలంటే ముందుగా ఆయా సర్వే నంబర్లో ఇతర పట్టాదారులకు నోటీసులు జారీ చేయాలి. ఆయా నంబర్లలలో గల్లంతైన భూమిని వెతకాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయికి వెళ్లి పంచనామాలు చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలంటే తగిన సిబ్బంది అవసరం. అయితే చాలా మండలాల్లో రెవెన్యూ సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీఆర్ఓలను ప్రభుత్వం తిరిగి రెవెన్యూశాఖకు పంపాలని నిర్ణయించినప్పటికీ.. వారు ఇంకా పూర్తిస్థాయిలో రెవెన్యూశాఖకు రాలేదు. దీంతో ఉన్న సిబ్బందితోనే ఈ పక్రియను నిర్వహించాల్సి వస్తోంది.
మూడో వంతు ఇవే..
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా పక్షం రోజుల క్రితం వరకు గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. జిల్లాలో మొత్తం 596 గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో రైతుల నుంచి 16,036 దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో మిస్సింగ్ సర్వే నంబర్కు సంబంధించిన దరఖాస్తులే 5,324 రావడం గమనార్హం. అంటే వచ్చిన దరఖాస్తుల్లో 33 శాతం మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించినవే ఉన్నాయి. వీటి తర్వాత భూములకు వారసత్వ హక్కులు కల్పించాలని వచ్చిన అర్జీలు అధికంగా ఉన్నాయి. ఇలా సక్సేషన్ కోసం 1,412 దరఖాస్తులు రాగా, మ్యూటేషన్ల కోసం మరో 1,485 దరఖాస్తులు వచ్చాయి. నిషేధిత భూముల జాబితాల్లోంచి తమ భూమిని తొలగించాలని కోరుతూ వచ్చిన వినతులు 1,180 ఉండగా, అసైన్డ్ భూములకు సంబంధించినవి 767, మరో 2,290 దరఖాస్తులు సాదాబైనామాలు.. ఇలా అన్నిరకాల దరఖాస్తులు ఉన్నాయి.
పోర్టల్లో నమోదు..
వచ్చిన దరఖాస్తులను భూభారతి పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఆయా తహసీల్దార్లకు ఇచ్చిన ప్రత్యేక లాగిన్లో ఈ దరఖాస్తులను ఉంచుతున్నారు. ఈ ఆన్లైన్ ప్రక్రియ కొంత ప్రహాసనంగా సాగుతోంది. ఒక్కో దరఖాస్తుకు సుమారు 20 నిమిషాలు పడుతోందని, సర్వర్ స్లోగా ఉంటే మరింత టైం పడుతోందని రెవెన్యూ సిబ్బంది పేర్కొంటున్నారు.
అర్జీల పరిష్కారంపై దృష్టి
భూభారతి దరఖాస్తుల ఆన్లైన్ నమోదు పూర్తయిన మండలాల్లో ఆయా అర్జీల పరిష్కారంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. డాక్యుమెంట్లను పరిశీలించి సంబంధిత పట్టాదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సైతం చేపడుతున్నారు.