
వల్లూర్లో ముదిరిన చేపల వివాదం
16 మంది ముదిరాజ్ల బైండోవర్
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం వల్లూర్లో ఏడాదిగా చెరువులో చేపలు పట్టుకునే విషయంలో గ్రామస్తులు, ముదిరాజ్లకు వివాదం నడుస్తోంది. వల్లూర్ చెరువులో చేపలు పట్టేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను డీసీఎంలో ముదిరాజ్లు తీసుకురావడంతో గ్రామస్తులు అడ్డుకొని పోలీస్లకు అప్పగించారు. గతంలో పంచాయతీ వద్ద నిర్వహించిన గ్రామసభలో అధికారులు ఇరువర్గాలతో చర్చించారు. చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యశాఖ సభ్యత్వం ఉన్నవారు మాత్రమే అర్హులని తేల్చిచెప్పారు. దీనికి గ్రామస్తులు కట్టుబడి ఉంటామన్నారు. అయితే ఇతరులు వస్తే మాత్రం అడ్డుకుంటామని చెప్పారు. కాగా శనివారం డీసీఎంలో వలలతో ఇతర ప్రాంతానికి చెందిన మత్స్యకారులను చేపలు పట్టేందుకు రావడంతో గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్, ఎస్ఐ అహ్మద్ మోహినొద్దీన్ ఇరువర్గాలను సముదాయించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 16 మంది ముదిరాజ్లను బైండోవర్ చేశా రు. మరోవర్గానికి చెందిన వారిని సోమవారం బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు.