
ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై అనాసక్తి
● ముందుకు రాని లబ్ధిదారులు ● జిల్లాకు 14,518 ఇళ్లు మంజూరు ● ప్రారంభించినవి 5,023 మాత్రమే..
వారంలో 50 శాతం ప్రారంభిస్తాం
మరో వారం రోజుల్లో 50 శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నాం. లబ్ధిదారులకు వెంట వెంటనే బిల్లులు చెల్లిస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో బేస్మెంట్ వరకు పూర్తయిన 286 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున బిల్లులు అందించాం. గ్రామాల్లో అధికారులు సైతం అవగాహన కల్పిస్తున్నారు. కొంతమంది ఆషాడం అని ముందుకు రావడం లేదు.
– చలపతిరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ
హత్నూర(సంగారెడ్డి): ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకురావడం లేదు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఆసక్తి చూపడం లేదు. జిల్లాకు 14,518 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు కేవలం 5,023 మంది మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు. 286 ఇళ్లు బేస్మెంట్ వరకు పూర్తి కావడంతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో అధికారులు రూ. లక్ష చొప్పున జమ చేశారు. అయితే 15 రోజుల క్రితం వరకు జిల్లాలో కేవలం 2,000 మంది మాత్రమే ఇళ్లు కట్టుకోవడానికి ముందుకొచ్చారు. ఈ వారంలో 3,000 మంది లబ్ధిదారులు ముగ్గుపోయడంతో కొంత పురోగతి కనిపించింది. 60 గజాలలోపు ఇంటి నిర్మాణం చేపట్టాలనే నిబంధనతో కొంతమంది ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. మరికొందరు తమకు అనుకూలంగా ముగ్గుపోసుకొని ఇంటి నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. అయితే వాటికి బిల్లు మంజూరు కాదని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతిఒక్కరూ అధికారులు వచ్చి ముగ్గు పోసిన తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది.
అవగాహన కల్పిస్తున్న అధికారులు
గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు పనులు ప్రారంభించాలని అవగాహన కల్పిస్తున్నారు. అయితే డబ్బులు లేక కొందరు, స్థలం అనుకూలంగా లేక మరికొందరు ముందుకు రావడం లేదు. ఇంకొందరు ఉన్న ఇంటిని కూల్చివేసి కొత్తది నిర్మించుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. హత్నూర మండలం ముచ్చర్ల గ్రామానికి 94 ఇళ్లు మంజూరు కాగా, 50 మంది ఆర్థిక స్థోమత లేదని, ఇళ్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నామని అధికారులకు రాత పూర్వకంగా రాసిచ్చారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై అనాసక్తి