
అత్యుత్తమ ప్రమాణాలతోనే న్యాక్ గుర్తింపు
దుబ్బాకటౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బోధన, సౌకర్యాల కల్పన, సాంకేతికత వినియోగం లాంటి ప్రమాణాలను మెరుగు పరచుకోవడం ద్వారా న్యాక్ గుర్తింపు సాధించవచ్చని ప్రొ.ఎస్వీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చెక్ ప్రాజెక్ట్ కింద ఎంపికై న 22 కళాశాలల్లో, 11 కళాశాలలకు తాను మెంటార్గా ఉన్నానని, వాటిలో దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒకటని తెలిపారు. నైపుణ్య శిక్షణ తరగతులు, సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణ, డిజిటల్ లైబ్రరీ వినియోగం, బోధనలో ఐటీసీ వనరుల వినియోగం, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికతలను అధ్యాపకుల బోధనలతో అనుసంధానించడం వల్ల న్యాక్ గుర్తింపులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.భవాని, వైస్ ప్రిన్సిపాల్ శ్యాంసుందర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ వెంకట్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.