
పేదలకోసం రాజీలేని పోరాటం
సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి
హుస్నాబాద్: ప్రజల కోసం అలుపెరుగని, రాజీలేని పోరాటాలు చేసిన చరిత్ర గల ఏకై క పార్టీ సీపీఐ పార్టీ అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. పట్టణంలోని అనబేరి, సింగిరెడ్డి అమరుల భవన్లో ఈ నెల 27న నిర్వహించే సీపీఐ 4వ మహాసభల విజయవంతం కోసం శుక్రవారం ఏర్పాటు చేసిన ఆహ్వాన సంఘం సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో బీజేపీ పాలన మతోన్మాదం, పెచ్చరిల్లి పోతుందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లెడ పడుతూ ఆదివాసీలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న మావోయిస్టులను చంపడం ఏమిటని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపి వేయాలని, లేకుంటే ప్రజలతో దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆహ్వాన సంఘం నూతన కమిటీ
సీపీఐ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, ప్రధాన కార్యదర్శిగా హుస్నాబాద్ మండల కార్యదర్శి గడిపె మల్లేశ్, ఉపాధ్యక్షులుగా జాగీర్ సత్యనారాయణ, పోతిరెడ్డి వెంకట్ రెడ్డి, లక్ష్మణ్, శంకర్, వనేష్, అశోక్, దయానంద్ రెడ్డి, కోశాధికారిగా సుదర్శన చారిని ఎన్నుకున్నారు.