
ప్రాణం తీసిన చేపల వేట
చెరువులో మునిగి బాలుడు మృతి
అల్లాదుర్గం(మెదక్): చేపల వేటకు వెళ్లిన బాలుడు కాలు జారి చెరువులో మునిగి మృతి చెందాడు.ఈ ఘటన అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సాయిలు, సంతోష దంపతులు హైదరాబాద్లో వాచ్మెన్గా పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. మూడు రోజుల క్రితం గ్రామ దేవతలకు ఉత్సవాలు నిర్వహించడంతో సాయిలు కుటుంబం ఉత్సవాలకు వచ్చారు. ఈ క్రమంలో సాయిలు కొడుకు సతీశ్రావ్ (14)తో పాటు మరో ఇద్దరు కలిసి గ్రామ శివారులోని రెలకుంట చెరువులో సరదాగా చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో సతీశ్రావ్ ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో మునిగిపోయాడు. వెంట వచ్చిన ఇద్దరు గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పారు. స్థానికులు చెరువు వద్దకు వచ్చి వెతకగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపారు.