
మోటార్ల దొంగలు అరెస్ట్
కేసును ఛేదించిన రేగోడ్ పోలీసులు
రేగోడ్(మెదక్): వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లను దొంగిలిస్తున్న నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో అల్లాదుర్గం సీఐ రేణుకా రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రేగోడ్ మండలంలోని పెద్దతండాకు చెందిన వడ్త్యా కిషన్ నాయక్, హరిజానాయక్ నెల క్రితం ఆయా గ్రామాల్లో వ్యవసాయ బోరు మోటార్లను దొంగిలించారు. వాటికి ఉండే స్టాండ్లను కూడా ఎత్తుకెళ్లారు. అయితే కొండాపూర్ గ్రామానికి చెందిన పట్లోళ్ల శ్రీకాంత్ ఫిర్యాదుతో పాటు మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. ఏఎస్ఐ శంకర్, కానిస్టేబుళ్లు వినోద్, సురేశ్, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించారు. రూ.70 వేల విలువైన ఐదు మోటార్లు, రెండు స్టాండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలించారు. ఏఎస్ఐ శంకర్, సిబ్బందిని సీఐ అభినందించారు.
ఆరెగూడెం చోరీ కేసులో..
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని ఆరెగూడెంలో వారం రోజుల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై రాజు వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన హనుమాద్రి లక్ష్మాగౌడ్ ఇంట్లో ఈ నెల 5న చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగులగొట్టి చెక్కపెట్టెలో దాచిన రూ.90 వేలు నగదును అపహరించారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా అదే గ్రామానికి చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. దొంగిలించిన సొత్తులో ఖర్చుపెట్టుకోగా మిగిలిన రూ.23 వేలు నగదు, ఒక సెల్ఫోన్, దొంగతనానికి ఉపయోగించిన ఇనుప పైపును స్వాధీనం చేసుకున్నారు. గురువారం కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు.