వ్యర్థజలాలతో విధ్వంసమే | - | Sakshi
Sakshi News home page

వ్యర్థజలాలతో విధ్వంసమే

Jun 13 2025 7:17 AM | Updated on Jun 13 2025 7:17 AM

వ్యర్థజలాలతో విధ్వంసమే

వ్యర్థజలాలతో విధ్వంసమే

వర్షం నీటిలో వదలొద్దని పరిశ్రమలకు పీసీబీ తాఖీదులు
● సాల్వేంట్‌ రికవరీ, షుగర్‌ డిస్ట్రిలరీలకు సైతం! ● ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు ● పీసీబీవి నామ మాత్రపు చర్యలేనంటున్న ప్రజలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పరిశ్రమల్లో ఉత్పత్తి అయిన హానికరమైన రసాయన వ్యర్థ జలాలను వాననీటిలోకి వదిలేయడం జిల్లాలో పరిపాటైపోయింది. ఫలితంగా చెరువులు, కాలువలు కలుషితమై పశుపక్ష్యాదులు మృత్యువాత పడుతున్నాయి. ఇక వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు సైతం కలుషితమై మానవాళికీ ముప్పుగా పరిణమిస్తోంది. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) జిల్లాలో సంబంధిత పరిశ్రమలకు నోటీసులు జారీ చేసింది. ఫార్మాస్యూటికల్‌, సాల్వేంట్‌ రికవరీ, కెమికల్‌, బల్క్‌డ్రగ్‌, బ్రూవరీ, షుగర్‌, డిస్ట్రిలరీలకు ఈ తాఖీదులు ఇస్తోంది. ఇలా జిల్లావ్యాప్తంగా 120కి పైగా పరిశ్రమలకు ఈ ముందస్తు నోటీసులు వెళ్లాయి. ప్రధానంగా జిన్నారం మండలం గడ్డపోతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలతోపాటు, పటాన్‌చెరు మండలం పాశమైలారం, సంగారెడ్డి, హత్నూర మండలం గుండ్లమాచనూరు, కొండాపూర్‌, సదాశివపేట మండలాల్లోని ఆయా కేటగిరీలకు చెందిన పరిశ్రమలు ఈ నోటీసులు వెళ్లాయి.

జిల్లాలోని రెడ్‌ కేటగిరీకి చెందిన పరిశ్రమలు సుమారు రెండు వేల వరకు ఉంటాయి. ఇందులో చాలా పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు సంబంధించిన కనీస ప్రమాణాలు పాటించడం లేదు. ఆయా పరిశ్రమల్లో నిత్యం ఉత్పత్తి అయ్యే హానికరమైన రసాయన వ్యర్థాలను నిల్వ చేస్తుంటాయి. వర్షకాలం రాగానే వర్షపునీటిలో వదిలేస్తుండటం పరిపాటిగా మారింది. వర్షాలు కురుస్తున్న రాత్రివేళల్లో ఈ హానికరమైన రసాయన వ్యర్థాలను పరిశ్రమల నుంచి బయటకు వదిలేస్తుంటాయి. కాలకూట విషంతో సమానమైన ఈ హానికరమైన రసాయన వ్యర్థాలు వర్షం నీటిలో కలిసి సమీపంలో చెరువులు, కుంటల్లోకి చేరుతోంది. వర్షం నీటితోపాటు చాలా మట్టుకు భూగర్భంలోకి ఇంకి పోతున్నాయి. దీంతో చెరువులు కుంటలు కాలుష్య కాసారాలుగా మారడంతో పాటు, భూగర్భ జలాలు కూడా పూర్తిగా కలుషితమవుతున్నాయి. ఈ నీటిని తాగే పశుపక్ష్యాదులు మృత్యువాత పడటం, చెరువుల్లోని చేపలు మృతి చెందడం పరిపాటైపోయింది. ఇలా వర్షాకాలం వస్తే చాలు జలకాలుష్యం తీవ్రరూపం దాల్చుతోంది.

మొక్కుబడి నోటీసులేనా..?

జిల్లాలో రెడ్‌ కేటగిరీ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో జరుగుతున్న జీవన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆర్థిక, రాజకీయ, అంగబలం ఉన్న ఈ పరిశ్రమల యాజమాన్యాల ఆగడాలపై స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మొక్కుబడి చర్యలతోనే సరిపెడుతున్నారు. ఇలా పరిశ్రమలకు నోటీసులు ఇవ్వడం పరిపాటేనని, ఆయా పరిశ్రమలు ఇలా రసాయన వ్యర్థ జలాలను వదలడం కూడా సాధారణమేనని బాధితులుగా మారుతున్న స్థానికులు వాపోతున్నారు. కాలుష్యంపై పీసీబీకి ఏటా వందల సంఖ్యలో ఫిర్యాదులు అందినా మొక్కుబడి చర్యలు తీసుకోవడం పరిపాటే. నోటీసులు అంటూ..శాంపిళ్ల సేకరణ.. వంటి నామమాత్ర చర్యలతో సరిపెడుతున్న పీసీబీ అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో మొక్కుబడిగా ఆయా పరిశ్రమలు ఇచ్చే రూ.లక్ష, రూ.రెండు లక్షల బ్యాంకు గ్యారంటీలను జప్తు చేయడం వంటి చర్యలతోనే సరిపెడుతున్నారు. అలాగే మొక్కుబడి జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఈ పరిశ్రమల ఆగడాలు ఏటా వర్షాకాలం యథేచ్చగా సాగుతున్నాయి. ఇప్పుడు ముందస్తుగా ఇస్తున్న తాఖీదులు కూడా మొక్కుబడి తంతనే అభిప్రాయం బాధితుల్లో వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement