
బాల భరోసాకు శ్రీకారం
చిన్నారుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం
● ఐదేళ్లలోపు చిన్నారులకు వైద్య పరీక్షలు ● పథకం అమలుకు ప్రత్యేక చర్యలు
సంగారెడ్డి జోన్: చిన్నారుల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. త్వరలో అంగన్వాడీ కేంద్రాల్లో బాల భరోసా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కేంద్రాలలోని బాలింతలు, గర్భవతులు, చిన్నారులకు సేవలు అందిస్తుండగా బాల భరోసా పథకం కింద వైద్య పరీక్షలను కూడా చేపట్టనుంది. పథకం అమలుకు మార్గదర్శకాలను అధికారులు రూపొందిస్తుంది. ప్రతీ ఏటా అంగన్వాడీ కేంద్రాల్లో పోషణమాసం నిర్వహించి పోషకాహార విలువలు, పౌష్టికాహారంపై తగిన సూచనలు సలహాలు అందిస్తున్నారు. పౌష్టికాహారలోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి అనుబంధ పోషకాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
బాల భరోసాతో చిన్నారుల సంరక్షణ
ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంటుంది. గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు గుడ్లు, పాలు, పౌష్టికాహారం, బాలామృతం పంపిణీ చేస్తున్నారు. చిన్నారులకు నెలవారి ఇంజక్షన్లు అందిస్తున్నారు. చిన్నారి బరువు, ఎత్తులను పరిశీలించి ఎదుగుదలకు అవసరమయ్యేలా చర్యలు తీసుకుంటుంది. బాల భరోసా పథకం ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనుంది. ఆరోగ్య పరీక్షలలో ఏమైనా లోపాలు, ఆరోగ్య సమస్యలు ఉంటే చికిత్స నిమిత్తం పెద్ద ఆస్పత్రులకు పంపించి ఉచిత వైద్యాన్ని అందించనున్నారు.
జిల్లాలో 1504 అంగన్వాడీ కేంద్రాలు
జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా, వాటి పరిధిలో 1,504 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో సుమారు 93వేల మంది చిన్నారులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ పథకంతో చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గ్రామాల్లో సర్వే జరుగుతోంది
ఇప్పటికే మహిళా శిశు సంక్షేమశాఖ ద్వారా సర్వే చేసి ఐదేళ్లలోపు పిల్లలను గుర్తిస్తున్నాం. గ్రామాల్లో ఈ సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే బాల భరోసా పథకాన్ని అమలు చేస్తాం.
లలిత కుమారి, జిల్లా సంక్షేమశాఖ అధికారి, సంగారెడ్డి
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన విద్యార్థుల వివరాలు
ప్రాజెక్టు పేరు 0–5సం.లోపు ఉన్న చిన్నారులు
జోగిపేట 13,086
నారాయణఖేడ్ 16,690
పటాన్చెరు 21,707
సదాశివపేట 16,455
జహీరాబాద్ 27,337