
జిల్లా కలెక్టర్గా పి.ప్రావీణ్య
● వల్లూరు క్రాంతి టూరిజం కార్పొరేషన్కు బదిలీ ● ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పి.ప్రావీణ్య నియమితులయ్యారు. హన్మకొండ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ప్రావీణ్యను ఇక్కడికి బదిలీ చేశారు. సంగారెడ్డి కలెక్టర్గా పనిచేస్తున్న వల్లూరు క్రాంతి బదిలీ అయ్యారు. ఆమెను తెలంగాణ పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల రాష్ట్ర ఉన్నతాధికారులను మూకుమ్మడి బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతికి బదిలీ అయింది. 2024 జనవరి 4న కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన క్రాంతి జిల్లాలో సుమారు 17 నెలలు పనిచేశారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యత
ప్రధానంగా మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. ప్రధానంగా ఎస్హెచ్జీ (స్వయం సహాయక సంఘాల) మహిళలు స్వావలంబన సాధించే దిశగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా డ్రోన్ దీదీ పథకం అమలు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల నిర్వహించిన ‘మన్కీ బాత్’లో ఈ డ్రోన్ మహిళల పథకాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎస్హెచ్జీ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ తీసుకుని ఈ డ్రోన్ల సహాయంతో వ్యవసాయ పనులను చేస్తున్నారు. అలాగే మహిళలకు కారు డ్రైవింగ్లో శిక్షణ ఇప్పించారు. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా ట్యాక్సీలు నడిపేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎస్హెచ్జీ మహిళలతోనే పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేయించారు. ఈ బంక్ను ఇటీవలే ట్రయిల్ రన్ జరుగుతోంది. త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ బంక్ను అధికారికంగా ప్రారంభించనున్నారు.
పాలనపై తనదైన ముద్ర..
కలెక్టర్ క్రాంతి జిల్లా పాలనపైనా తనదైన ముద్ర వేశారు. తరచూ సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో జిల్లా అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపించారు. ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి వంటి ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే నిరుపేదలు విద్యనభ్యసించే ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో కలెక్టర్ క్రాంతి సఫలీకృతులయ్యారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా కూడా వ్యవహరించారు.
ప్రొఫైల్
పి.ప్రావీణ్య 2016 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. సివిల్స్లో 82వ ర్యాంక్ సాధించారు. రెండో ప్రయత్నంలోనే అఖిల భారత సర్వీసుకు ఎంపికయ్యారు. ముందుగా కర్ణాటక కేడర్ అధికారిగా నియమితులు కాగా, తర్వాత తెలంగాణకు బదిలీ అయ్యారు. హన్మకొండ కలెక్టర్గా పనిచేస్తున్న ఆమె గతంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా పని చేశారు. కరీంనగర్ ట్రైనీ కలెక్టర్గా కూడా పని చేశారు. ఆమె విద్యాభ్యాసం బెంగళూరులో సాగినట్లు సమాచారం.