
‘ప్రైవేట్’ ఫీజుల దోపిడీని అరికట్టాలి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు అధిక ఫీజులను నిరసిస్తూ గురువారం సంగారెడ్డిలోని జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ...జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి విద్యను వ్యాపారమయం చేశారన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘంచి విద్యా చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ లాభార్జనే తమ ధ్యేయంగా ప్రైవేట్ విద్యావ్యవస్థ కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాలు, దుస్తులు కూడా విద్యాసంస్థల్లో పెట్టి వ్యాపారం కొనసాగిస్తుంటే విద్యాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గుర్తింపులేని ప్రైవేటు విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలి: కేవీపీఎస్
పేద విద్యార్థులకు కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం డిమాండ్ చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డిలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీ పాల్పడుతున్నాయని మండిపడ్డారు.