
గడువులోగా ఇందిరమ్మ ఇళ్లు పూర్తి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
పటాన్చెరు: ఇందిరమ్మ ఇళ్లను నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేసేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పొంది...వాటిని వినియోగించని వారి స్థానంలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై గురువారం వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలలో తొలి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులందరూ నిర్మించుకునేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏర్పడితే పరిష్కరించేలా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. నోటరీ పేరుతో లబ్ధిదారులు తమ ఇళ్లను విక్రయించినట్లు విచారణలో తేలితే వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. స్థానిక కోట కింద మిగిలిన ఇళ్లను సైతం అర్హులైన లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదే విధంగా నియోజకవర్గ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న 5500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్కు ఎమ్మెల్యే ఫోన్లో సూచించారు. కొల్లూరు, ఉస్మాన్నగర్, అమీన్పూర్, కర్దనూర్, నాగులపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. వ్యాపార సముదాయాలోని దుకాణాలను నోటిఫికేషన్ ద్వారా మాత్రమే కేటాయించాలని సూచించారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు నరసయ్య, పీడీ చలపతిరావు, డీఈ రవీందర్, ఆయా మండలాల తహసీల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.