
అందోలులోనే నవోదయ పాఠశాల
● ఉన్నతాధికారుల నుంచి లభించిన అనుమతులు ● స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
జోగిపేట(అందోల్): జవహర్ నవోదయ పాఠశాల అందోలులో ఏర్పాటుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు లభించాయి. జిల్లాకు మంజూరైన పాఠశాల ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయం స్థానికంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో గురువారం కలెక్టర్ వల్లూరు క్రాంతి అందోలులోని సర్వేనంబరులోని 1141లోని 30 ఎకరాల స్థలాన్ని ఆర్డీఓతో కలిసి పరిశీలించారు. దీంతో దాదాపు అందోలులోనే నవోద పాఠశాల నిర్మాణం చేపడుతున్నట్లు స్పష్టమైంది. ఈ స్థలాన్ని నవోదయ విద్యాసంస్థలకు చెందిన ఉన్నతాధికారులు ముందుగానే పరిశీలించి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
పూర్తి నివేదికకు కలెక్టర్ ఆదేశం
అందోలు వద్ద ఉన్న 1141 సర్వే నంబరులోని స్థలాన్ని జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించి పూర్తి నివేదికను తయారు చేసి పంపాలని ఆర్డీఓ పాండు, ఇతర రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ స్థలంలో గతంలో ఎవరికై నా కేటాయించారా? వంటి విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ స్థలంలో చేపడుతున్న నిర్మాణ వివరాలను డిప్యూటీ తహసీల్దారు మధుకర్రెడ్డి మ్యాపు ద్వారా కలెక్టర్కు వివరించారు. నవోదయ విద్యా సంస్థల వారు కూడా ఈ స్థలానికి ఆమోదం తెలిపినట్లు తెలిపారు. దీని ప్రక్కనే 150 పడకల ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు వివరించారు.