
‘రైతు భరోసా’ వచ్చేనా
రాకుంటే సాగు సాగేదెట్టా!
● ప్రైవేటుగా పుట్టని అప్పులు ● విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు తప్పని తంటాలు
నోరు మెదపని అధికారులు
రైతు భరోసా ఆర్థిక సాయం ఎప్పుడు అందుతుందని రైతులు పదే పదే ప్రశ్నిస్తున్నా అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. తగిన సమాధానం చెప్పకుండా మిన్నకుంటున్నారని రైతులు విమర్శిస్తున్నారు. దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని అధికారుల తీరుపై రైతులు విమర్శిస్తున్నారు.
జహీరాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభం అయినా గత రబీ సీజన్కు సంబంధించిన రైతు భరోసా పూర్తిస్థాయిలో రైతులకు అందలేదు. రైతు భరోసా సాయాన్ని విడతలుగా అందజేస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చినా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అందజేయలేదు. గతేడాది వానాకాలం సీజన్లో రైతు భరోసా ఆర్థిక సహాయం కోసం రైతులు ఎదురుచూసినా ప్రభుత్వం నుంచి రూపాయి రాలేదు. రబీ సీజన్లో కూడా పరిమితి లేకుండా అందరికీ రైతు భరోసా సాయం అందిస్తామని ప్రచారం చేసుకున్నప్పటికీ అందరికీ ఇప్పటివరకు సాయం అందలేదని రైతులు వాపోతున్నారు. రబీ సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశారు. ప్రభుత్వం నుంచి రైతు భరోసా సాయం అందగానే అప్పులు తీర్చుతామని మాట ఇచ్చి పెట్టుబడులకు డబ్బు తెచ్చుకున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేక పోవడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
సాగు పెట్టుబడులు లేక డీలా
వానాకాలం సీజన్ ప్రారంభం అయినా చేతి లో చిల్లి గవ్వ కూడా లేకపోవడం, అప్పులు తెచ్చిన వారికి తిరిగి అప్పులు చెల్లించకపోవడంతో తాజాగా అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. రుణమాఫీ జరగకపోవడంతో బ్యాంకుల నుంచి కూడా అప్పు పుట్టని పరిస్థితి నెలకొందంటున్నారు.
అందించింది సగమే!
రబీ సీజన్కు సంబంధించిన రైతు భరోసా ఆర్థిక సాయం జిల్లాలో సగం మందికి మాత్రమే అందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 7.20 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రబీ సీజన్కుగాను రైతులకు ఎకరాకు రూ.6వేల వంతున ఒక విడత కింద సుమారు రూ.430 కోట్ల మేర రైతు భరోసా సాయం అందించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.200 కోట్లు మాత్రమే జిల్లాలోని రైతాంగానికి ఖాతాల్లో రైతు భరోసా డబ్బు జమ అయింది. ఇంకా సుమారు రూ.230 కోట్ల మేర రైతు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది.
మూడున్నర ఎకరాల వరకే
ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని మూడున్నర ఎకరాల వరకు మాత్రమే అందజేసిందని రైతులు పేర్కొంటున్నారు. కొందరు రైతులకు మూడు ఎకరాలు ఉన్నా రైతు భరోసా అందలేదంటున్నారు.