
పెదనాన్నపై తమ్ముడి కొడుకు దాడి..
పటాన్చెరు టౌన్: సొంత పెదనాన్నపై తమ్ముడి కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఘనపూర్కు చెందిన రాములు (60) (రిటైర్డ్ వీఆర్ఓ)కు గ్రామంలో మూడు రూమ్లు ఉన్నాయి. పక్కనే ఆయన సోదరుడికి కూడా ఉన్నాయి. రాములు రామచంద్రపురం పరిధిలోని అశోక్నగర్లో ఉంటున్నాడు. ఆయన సోదరుడు కృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతడి భార్య, కుమారులు ఘనపూర్లో ఉంటున్నారు. ఈనెల 4న రాత్రి ఘనపూర్కు వెళ్లాడు. రాములుకు చెందిన ఇంటిలో ఓ మహిళ ఉండటంతో ఇల్లు నీకు ఎవరు అద్దెకిచ్చారని అడిగాడు. పక్కనే ఉన్న ఆయన తమ్ముడి కొడుకు దిలీప్కుమార్ వచ్చి నీ ఇల్లు ఎక్కడ ఉందని గొడవపడ్డాడు. అనంతరం రాములుపై దాడి చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆయనను అదేరోజు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి కుమారుడు చైతన్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆపై పెట్రోలు పోసి నిప్పంటించిన వైనం
చికిత్స పొందుతూ మృతి