
మందుబాబులకు జరిమానా
పటాన్చెరు టౌన్: డ్రంకెన్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమానా విధించింది. పటాన్ చెరు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ వివరాల ప్రకారం... సోమవారం నిర్వహించిన వాహన తనిఖీలో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని మంగళవారం సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చగా ఏడుగురికి రూ. వెయ్యి, ఐదుగురికి రూ.1500 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.
హోటల్లో తిష్ట వేసిన
కొండెంగ
నర్సాపూర్: పట్టణంలోని ఓ హోటల్కు మంగళవారం కొండెంగ వచ్చి దర్జాగా కూర్చుంది. అడవి నుంచి వచ్చిన కొండెంగ స్థానిక రెడ్ రోస్ హోటల్లోకి వచ్చి ఖాళీగా ఉన్న ఓ టేబుల్ పక్కన కుర్చీలో కూర్చుంది. హోటల్ యజమాని అహ్మద్ దానికి బిస్కట్లు ఇవ్వగా తిని అక్కడే కునుకు సైతం తీసింది. కాగా సుమారు రెండు గంటల పాటు ఉండగా అక్కడకు వచ్చిన కస్టమర్లు దాని పక్క నుంచి వెళ్లినా ఏమనకుండా కూర్చోవడంతో పలువురు మొబైల్స్తో ఫొటోలు తీసుకున్నారు. కోతులు తమ ఇండ్లలోకి, హోటళ్లలోకి రాగానే వాటిని వెళ్లగొట్టేందుకు పట్టణ ప్రజలు నానా తంటాలు పడుతుంటారు. కాగా హోటల్కి వచ్చిన కొండెంగను యజమాని వెళ్లగొట్టక పోవడం గమనార్హం.
తాళి కట్టిన
కొన్ని నిమిషాలకే పిట్స్
చికిత్స పొందుతూ వరుడు మృతి
జహీరాబాద్ టౌన్: ఎన్నో కలలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన పెళ్లి కొడుకుని విధి వెంటాడింది. వధువు మెడలో తాళి కట్టిన కొన్ని నిమిషాలకే వరుడికి పిట్స్ వచ్చి మృతి చెందాడు. ఈ ఘటన జహీరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. ఝరాసంగం మండలం చిలమామిడి గ్రామానికి గొల్ల రాములు పట్టణంలోని శాంతినగర్లో ఉంటున్నాడు. ఆయన చిన్నకుమారుడు ధనరాజ్(25) పట్టణ సమీపంలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 8న పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువర్గం సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తాళి కట్టిన కొన్ని నిమిషాలకు పెళ్లి పీటలపై పిట్స్ వచ్చి కుప్పకూలాడు. వెంటనే ధనరాజ్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో హైదరాబాద్కు తీసుకెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో బంధుమిత్రులు దుఃఖంలో మునిగిపోయారు. చిలమామిడిలో అంత్యక్రియలు నిర్వహించారు.
12న అమర్నాథ్కు సరుకుల లారీలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జమ్ము కశ్మీర్లోని అమర్నాథ్ యాత్రలో భాగంగా చేపట్టనున్న అన్నదాన కార్యక్రమానికి అవసరమైన సరుకుల వాహనాలను ఈ నెల 12న ప్రారంభించనున్నట్లు అమర్నాథ్ సేవాసమితి అధ్యక్షుడు కాచం కాశీనాథ్, చైర్మన్ చీకోటి మధుసూదన్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు శరబేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కల్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించి, అనంతరం సరుకుల లారీకి పూజలు చేసి పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యేలు హరీశ్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్హుస్సేన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, టీపీసీసీ సెక్రటరీ గంప మహేందర్ హాజరుకానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు భూపతి, లక్ష్మణ్, రాములు, శరభయ్య, నవీన్ కుమార్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మందుబాబులకు జరిమానా