
బంగారు భవిష్యత్తుకు ఇంటర్ కీలకం
● కలెక్టర్ వల్లూరు క్రాంతి ● ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని సివిల్స్కు ఎంపికయ్యా ● 450 మంది విద్యార్థులకు రూ.9 లక్షల నగదు బహుమతి
పటాన్చెరు: విద్యార్థి జీవితంలో లక్ష్యం, ఇంటర్మీడియెట్ అత్యంత కీలకమని విద్య ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన పదో తరగతి వార్షిక ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ , జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతకుముందు మండలంలోని రుద్రారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని, రేషన్ షాపులను, ఇందిరమ్మ ఇళ్ల పనులను కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ...తాను విద్యార్థి దశలోనే ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని కలెక్టర్ కావాలన్న లక్ష్యం ఏర్పరచుకుని అందుకునుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని లక్ష్యాన్ని సాధించానన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి..విద్యార్థుల సంక్షేమానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేస్తున్న సేవలను ఆమె ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఇటీవల 30 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. భూ భారతి చట్టాన్ని అనుసరించి ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అన్ని అంశాలపై అవగాహన ఉండాలి:
ఎస్పీ పరితోశ్
విద్యార్థులు చదువుతోపాటు సమాజంలోని అన్ని అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. బిహార్లోని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను ఐపీఎస్ సాధించాలన్న లక్ష్యంతో విద్యార్థి దశ నుంచే ప్రణాళికాబద్ధంగా చదువుతూ లక్ష్యాన్ని సాధించానని తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న లక్ష్యంతో..దశాబ్ద కాలంగా పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలకు చెందిన 450 మంది మొదటి బహుమతి రూ.3 వేలు, ద్వితీయ బహుమతి రూ.రెండు వేలు, తృతీయ బహుమతి వెయ్యి రూపాయల చొప్పున రూ. తొమ్మిది లక్షల నగదు పురస్కారాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.