
భూ సేకరణ వేగవంతం
రాష్ట్ర పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్
సంగారెడ్డి జోన్: జహీరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న నిమ్జ్ భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి సంజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం నిమ్జ్ ప్రాజెక్టుపై కలెక్టర్ వల్లూరు క్రాంతితోపాటు అధికారులతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా ప్రత్యేక కార్యదర్శి మాట్లాడుతూ...ప్రాజెక్టును సకాలంలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూ సేకరణకు అందించే పరిహార పంపిణీ వేగవంతం చేయాలన్నారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళుతుందని తెలిపారు. మొదటి దశలో సేకరించిన భూములకు సంబంధించి రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని సూచించారు. 12,630 ఎకరాల లక్ష్య సేకరణలో ఇప్పటికే 7,300 ఎకరాలు భూసేకరణ పూర్తయినట్లు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తయితే జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. భూ సేకరణపై ప్రతీ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో టీజీఐఐసీ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, జహీరాబాద్ ఆర్డీఓ రాంరెడ్డి, రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిమ్జ్ భూములు పరిశీలన
జహీరాబాద్ నియోజకవర్గంలోని నిమ్జ్ భూములను రాష్ట్ర పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్ స్థానిక అధికారులతో పరిశీలించారు. ఝరాసంగం మండల పరిధిలోని బర్దీపూర్, ఎల్గోయి గ్రామ శివారుల్లోని ప్రాజెక్టు భూములను పరిశీలించారు.