చుట్టూ ఎత్తైన కొండలు.. పరుచుకున్న పచ్చని చెట్లు..వాటి మధ్యలో నిండుకుండలా అందమైన ప్రాజెక్ట్. కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో ఆరో నిజాం రాజు మీర్మహబూబ్ అలీఖాన్ 1887లో జలాశయం నిర్మాణం ప్రారంభించగా 1891లో పూర్తయింది. నేటికి 134 ఏళ్లు..అయినా చెక్కు చెదరకుండా ఉంది. మొదట్లో 4,827 ఎకరాల్లో ఆయకట్టు ఉండేది. ప్రస్తుతం రెండు మండలాల్లో కలిపి 5100 ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందుతోంది. – కోహెడ రూరల్ (హుస్నాబాద్):
జలాశయం నిర్మించి 134 ఏళ్లు
ప్రాజెక్టు రాగి తూము
● సీసం, డంగు సున్నం,
బంకమట్టితో నిర్మాణం
● నేటికీ చెక్కు చెదరని ప్రాజెక్ట్
● 9 గ్రామాల్లో
5100 ఎకరాలకు సాగు నీరు
● వందేళ్లు దాటినా లీకేజీలు లేవు
శనిగరం జలాశయం
నిర్మాణానికి 504 కిలోల బంగారం ఖర్చు
శనిగరం గ్రామంలో నిజాం కాలంలో మధ్యతరహ ప్రాజెక్టు నిర్మాణం అప్పటి చీఫ్ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో నిర్మించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద చెరువుగా శనిగరం ప్రాజెక్టు ఉండేది. ఈ పురాతన జలాశయం కోసం ఆ కాలంలో 560 సీర్లు (504 కిలోల బంగారం)ఖర్చు చేశారు. చెరువు తూము, ఆనకట్టను నున్నటి బండరాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చి వాటి మధ్యలో సీసం, డంగుసున్నం, బంకమట్టిని నింపి నిర్మించారు. ఇప్పటికీ చెరువు నిండా నీరున్నా ఒక్క చుక్క కూడా లీక్ కాదు. నాడు చేపట్టిన పనులు అంత అద్భుతంగా ఉండటమే కారణమని పలువురు అంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఒక టీఎంసీ ఉండి 42 అడుగుల ఎత్తులో ఉంటుంది.
5100 ఎకరాలకు సాగు నీరు
శనిగరం గ్రామంలో నిర్మించిన ప్రాజెక్టుతో కోహెడ, బెజ్జంకి మండలాల్లో కాలువల ద్వారా 9 గ్రామాలకు 5100 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ప్రత్యేకత ఏంటంటే ఈ రిజర్వాయర్ నిండినా ఎలాంటి ప్రమాదం లేకుండా నీరు వాటంతట అవే పోయేలా పాలింగ్ గేట్లను మొదట అమర్చారు. ఈ తరహా గేట్లు తుప్పు పట్టడంతో ఆధునీకరించి కొత్త గేట్లు బిగించారు. రైతులకు, మత్స్యకారులకు ఈ చెరువు కల్పతరువుగా మారింది. గంగమ్మ, దాయాల మత్తడి కాలువల ద్వారా వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతోంది.
రైతులకు ఆధారం
మా గ్రామంలోని రైతులకు ప్రాజెక్టు ఆధారం. సుమారు ఐదువేల ఎకరాల్లో రెండు పంటలకు నీరు అందుతోంది. బోరు, బావుల్లో నీరు కంటే ఈ నీటితో పంటలు బాగా పండుతాయి. ఈ ప్రాంత రైతులకు ఇదే జీవనాధారం.
–గునిగంటి రాజయ్య, రైతు, శనిగరం
100 టన్నుల చేపల ఉత్పత్తి
ప్రాజెక్టుపై వెయ్యి మందికి పైగా మత్స్యకారులు ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి సంవత్సరం 100 టన్నులకు పైగా చేపల ఉత్పత్తి అవుతోంది. చేపలతో పాటు రొయ్యలు కూడా ఇక్కడ లభిస్తాయి.
– సూతరి కనకయ్య,
సంఘం నాయకులు
శనిగరం అద్భుతం
శనిగరం అద్భుతం
శనిగరం అద్భుతం