
యంత్రం సాగుకే మొగ్గు
● కూలీల కొరత,
పెట్టుబడుల భారం తగ్గింపు
● దుక్కి దున్నేది మొదలు
పంట కోత వరకు యంత్రాలే
● కిసాన్ మేళాలో
రైతుల పరిశీలన
హుస్నాబాద్రూరల్: వానాకాలం మొదలవ్వడంతోనే రైతులు సాగు పనుల్లో నిమగ్నమవుతారు. ఖరీఫ్ సీజన్లో వరి నాట్లు, విత్తనాలు వేసేందుకు కూలీలకు ముందుగా డబ్బులు చెల్లించి పనులకు తీసుకెళ్తారు. విత్తనాలు, వరి నాట్లు వేయడానికి కూలీలు దొరకకపోవడంతో బీహార్, మహారాష్ట్ర బీదర్, ఒడిశా రాష్ట్రాల నుంచి పురుషులు వస్తున్నారు. కూలీల కొరత, జాతీయ ఉపాధిహామీ పథకంతో కూలీ రేట్లు పెరగడంతో రైతులకు పెట్టుబడుల భారం పెరుగుతోంది. దీనిని అధిగమించడానికి రైతులు యంత్రాల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన కిసాన్ మేళాలో రైతులు యంత్రాల అన్వేషణలోనే నిమగ్నమై వాటి పని తీరు, ధరలు, బ్యాంకుల నుంచి అందించే రుణాల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తే అధిక దిగుబడులు తీసి వ్యవసాయంను పండగ చేస్తామని రైతులు అభిప్రాయపడుతున్నారు.
కలుపు తీయడానికి..
దుక్కి దున్నేందుకు ట్రాక్టర్లను వినియోగిస్తున్న రైతులు విత్తనాలు వేసేందుకు యంత్రాలను వాడుతున్నారు. రూ.5వేలకు దొరికే విత్తన యంత్రంతో రెండు గంటల్లో ఎకరం దుక్కిలో విత్తనం వేయొచ్చు. మొక్కల మధ్య దూరం పెంచుకునే అవకాశం ఉంది. పత్తి, మొక్కజొన్న లాంటి ఆరుతడి పంటల్లో కలుపు తీయడానికి కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. కూలీల అవసరం లేకుండా పవర్ టిల్లర్తో 2 గంటల్లో కలుపు తీయొచ్చు. మార్కెట్లో పవర్ టిల్లర్ రూ.72వేలకు దొరుకుతుంది. పత్తి తీసేందుకు, మొక్కజొన్న పంటను కోసే యంత్రాలు రైతులకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కూరగాయల విత్తనాలు నాటే యంత్రాలను కూడా కిసాన్ మేళాలో ప్రదర్శించడం ద్వారా రైతులు ఆసక్తిగా పరిశీలించారు.
నాట్లు వేసేందుకు..
వరి నాట్లు వేయాలంటే రైతులకు కూలీల కొరత ఉంది. ఒక ఎకరంలో నాటు వేయడానికి కూలీల ఖర్చు రూ.7,500 అవుతుంది. రెండు లీటర్ల పెట్రోల్తో మిషన్ ఎకరం నాటు వేస్తుంది. ఎకరాకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు నాటు వేసే యంత్రాలు అద్దెకు దొరుకుతాయి. యంత్రం సహాయంతో నాటు వస్తే డబ్బులు తక్కువ, సమయం కూడా ఆదా అవుతుంది. వరిలో కలుపు తీసే వీడర్ మార్కెట్లో ఉంది. రైతులు వరి నాటు మొదలు కోత వరకు యంత్రాల కోసమే ఎదురు చూస్తున్నారు.
సబ్సిడీపై ఇవ్వాలి
కిసాన్ మేళా వల్ల గ్రామాల రైతులకు చాలా విషయాలు తెలిశాయి. కూలీల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం యంత్రాలను సబ్సిడీపై అందిస్తే రైతులకు పెట్టుబడుల భారం తగ్గుతుంది. డ్రోన్ సహాయంతో ఎరువులు పిచికారీ చేయడం వల్ల రైతులకు క్రిమిసంహారక మందుల ప్రమాదం తప్పుతుంది. ఊరికి నాలుగు నాటు వేసే యంత్రాలు, డ్రోన్లు, సాగుకు ఉపయోగపడే యంత్రాలు ఇస్తే ఊరందరికి ఉపయోగపడతాయి.
– అలేటి ఈశ్వర్రెడ్డి,
రైతు, పోతారం(ఎస్)

యంత్రం సాగుకే మొగ్గు

యంత్రం సాగుకే మొగ్గు

యంత్రం సాగుకే మొగ్గు