
కూలిన పట్టుపురుగుల షెడ్డు
కౌడిపల్లి(నర్సాపూర్): మల్బరి పట్టు పురుగుల షెడ్డు ఈదురు గాలులతో కూడిన వర్షానికి కూలింది. ఈ ఘటన మండలంలోని రాయిలాపూర్తండాలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడు, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన నునావత్ రాజు తన పొలంలో కొన్నేళ్ల క్రితం మల్బరి పట్టుపురుగుల షెడ్డు నిర్మించాడు. ప్రస్తుతం లాభాలు సరిగా లేకపోవడంతో ఖాళీగా ఉంది. కాగా రాత్రి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన గాలి వాన రావడంతో షెడ్డు పూర్తిగా కూలింది. రేకులు, గోడలు సైతం ధ్వంసమయ్యాయి. దీంతో రాజుకు సుమారు రూ .2లక్షలు నష్టం వాటిల్లింది. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరాడు.
కలశం విగ్రహం వెలుగులోకి..
హుస్నాబాద్రూరల్: మండలంలోని పొట్లపల్లి మల్లికార్జునస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆదివారం పునాది తవ్వుతుండగా రాతి కలశం విగ్రహం బయటపడినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో 1996లో కూడా పెద్ద శివలింగం బయటపడటంతో అక్కడే దేవాలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. పొట్లపల్లి నూటొక్క దేవాలయాలకు నిలయంగా ఉండేదని చరిత్ర కారులు అభిప్రాయపడుతున్నారు. మల్లికార్జునస్వామి వారి విగ్రహం కూడా గతంలో బయట పడటంతో అక్కడే గుడి నిర్మించి పూజలు చేస్తున్నారు.
రెండు బైకులు ఢీ
ముగ్గురికి గాయాలు
శివ్వంపేట(నర్సాపూర్): రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ఉసిరికపల్లి గ్రామ చౌరస్తా తూప్రాన్– నర్సాపూర్ హైవేపై ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఏదుల్లాపూర్ పులుగం వాడకు చెందిన సంజీవరెడ్డి గ్రామం నుంచి బైక్పై దొంతి వైపునకు వస్తున్నాడు. వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామానికి చెందిన మేకల లక్ష్మీ, నర్సిహులు దంపతులు శివ్వంపేటలో పెళ్లికి వెళ్లి గ్రామానికి బైక్పై వస్తుండగా రెండు బైక్లు ఉసిరికపల్లి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నర్సిహులు తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పృహ తప్పి పడిపోగా, లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. సంజీవరెడ్డికి గాయాలవ్వగా చికిత్స నిమిత్తం తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు.
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి..
అక్కన్నపేట(హుస్నాబాద్): వృత్తిలో భాగంగా ఓ గీత కార్మికుడు తాటిచెట్టు ఎక్కి కల్లు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు జారి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని గౌరవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బైరగోని రవి ఆదివారం గ్రామ సమీపంలోని తాటివనంలోని తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు జారి పడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్లో హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు.
మహిళ మృతదేహం లభ్యం
సంగారెడ్డి క్రైమ్: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన సంగారెడ్డి పట్టణ పోలీస్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ రమేష్ వివరాల ప్రకారం... స్దానిక మహబుబ్సాగర్ చెరువు కట్ట పరిసర ప్రాంతంలో ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కూలిన పట్టుపురుగుల షెడ్డు