
లిఫ్ట్ ఇచ్చి.. ఆభరణాలు చోరీ
మనోహరాబాద్(తూప్రాన్): లిఫ్టు పేరుతో వృద్ధురాలిని బైక్పై ఎక్కించుకున్న గుర్తుతెలియని దుండగులు బంగారు, వెండి ఆభరణాలతో ఉడాయించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన మండలంలోని పరికిబండ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై సుభాష్గౌడ్ వివరాల ప్రకారం..సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మన్నె రామవ్వ అనే మహిళ శనివారం గజ్వేల్ మీదుగా వర్గల్ మండలంలోని పాములపర్తికి బయలుదేరింది. ఈ క్రమంలో గజ్వేల్లో బస్సు కోసం ఎదురు చూస్తుండగా బైక్పై వచ్చిన వ్యక్తితో పాటు మరో మహిళ వృద్ధురాలిని మాటల్లో పెట్టి పాములపర్తిలో దించుతానని నమ్మించి బైక్పై ఎక్కించుకున్నారు. పాములపర్తిలో దింపకుండా మనోహరాబాద్ మండలంలోని పరికిబండ శివారుకు తీసుకొచ్చి ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం రామవ్వ మెడలోంచి తులం బంగారు ఆభరణంతో పాటు 50 తులాల వెండి కడియాలు తస్కరించి పరారయ్యారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న అనంతరం వృద్ధురాలు తన ఆభరణాలు చోరీకి గురయ్యాయని గుర్తించి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలు తెలిపిన వివరాల ఆధారంగా నిందితుడు బైక్పై వెళ్తున్న సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు.
వృద్ధురాలి బంగారు,
వెండి కడియాలు అపహరణ