
సాహో.. సర్కారు బడి
సరికొత్త ఒరవడిలో
ప్రభుత్వ పాఠశాలలు ● కృత్రిమ మేధ..డిజిటల్ పాఠాలు ● ప్రీ ౖప్రెమరీ నుంచి ఆంగ్ల మాధ్యమం ● పీఎంశ్రీ పాఠశాలలకు రూ.కోటి ● చదువుతోపాటు క్రీడలకూ ప్రాధాన్యం
డిజిటల్ బోధన
మెదక్ జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాలలు, నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు 963 ఉండగా, 93,166 మంది విద్యార్థులున్నారు. ఈ యేడు ఆంగ్ల మాధ్యమంతో కూడిన పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించనున్నారు. భవిష్యత్ అవసరాల కనుగుణంగా డిజిటల్ బోధనకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ఐఎఫ్పీ ప్యానల్ బోర్డులపై పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఇందుకు 176 పాఠశాలల్లో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బాండ్ కనె క్షన్లు సైతం ఇస్తున్నారు. ఇందులో ఎల్ఎంఎస్ సాఫ్ట్వేర్ ప్రవేశపెట్టడం ద్వారా అన్ని సబ్జెక్ట్ల కంటెంట్ పొందుపరుస్తున్నారు. కృత్రిమ మేధలో భాగంగా ఏఐఎక్స్ఎల్ ప్రోగ్రాం ప్రారంభించారు. 21 పాఠశాలలను ఎంపిక చేశారు. 40 మందికి పైగా విద్యార్థులున్న మరో 300 పాఠశాలల ఎంపికకు ప్రతిపాదనలు పంపించారు. ఎక్స్టెప్ సంస్థ ఆధ్వర్యంలో ఆంగ్లం, తెలుగు చదవడం, రాయడంతో పాటు గణితంలో కూడా కనీస సామర్థ్యాలు సాధించేలా కంప్యూటర్ పరిజ్ఞానం అందిస్తున్నారు.
పాపన్నపేట(మెదక్): సర్కారు బడులు విజ్ఞాన శాలలుగా విరాజిల్లుతున్నాయి. బడిలో తొలి అడుగులు ఆంగ్ల మాధ్యమంతోనే ప్రారంభమవుతున్నాయి. పీఎంశ్రీ పథకం కింద మంజూరైన రూ.కోటి నిధులతో పాఠశాలల రూపు రేఖలు మారుతున్నాయి. డిజిటల్ శిక్షణ, కృత్రిమ మేధ, నిపుణుల బోధన, ఆట పాటల మైదానాలు..కళల కార్యశాలలు విద్యార్థులను జ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దుతున్నాయి. ఉపాధ్యాయుల అంకిత బోధనతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయి. ఈ యేడు పదో తరగతిలో 96.87 శాతం ఫలితాలతో జిల్లా రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. అందుకే‘ సర్కార్ బడి పిలుస్తొంది రా’ అంటూ ఉపాధ్యాయులు‘ బడిబాట’ పట్టారు.
పీఎంశ్రీ పథకంతో రూ.కోటి
ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైవింగ్ ఇండియా’పథకం కింద ఎంపికై న ప్రభుత్వ పాఠశాలలకు ఐదేళ్లలో రూ.కోటి నిధులు ఇస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు రెండు విడతల్లో 31 పాఠశాలలు ఎంపికయ్యాయి. 24 అంశాల కింద ఐదేళ్లలో రూ.కోటి మంజూరు చేస్తారు. బాలికల్లో ఆత్మరక్షణ, కిచెన్ గార్డెన్, వార్షికోత్సవాలు, విజ్ఞాన యాత్రలు, పాఠశాలకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చుకోవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
పాఠశాలలకు నిధుల వరద
నిధుల వరదతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. సౌకర్యాలు ఒన గూరుతున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద జిల్లాలోని 562 పాఠశాలలకు రూ.20.62 కోట్లు మంజూరయ్యాయి. వీటితో బడిలో కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా 10 నెలల పాటు పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పరిరక్షణ కోసం రూ.5.06 కోట్లు మంజూరు చేశారు. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పథకం కింద అన్ని పాఠశాలలకు రంగులు, డ్యూయల్ డెస్క్లు, గ్రీన్ బోర్డులు పంపిణీ చేశారు. ఈ యేడు 3కి.మీ దూరం నుంచి బడికి వచ్చే విద్యార్థులకు ట్రాన్స్పోర్టు అలవెన్స్ మంజూరు అయింది.
క్రీడల వేదికలు..
ప్రభుత్వ పాఠశాలలు పరిపూర్ణ వికాస కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. విద్యార్థి నిత్య జీవితంలో ఆటలు భాగస్వామ్యం అవుతున్నాయి. అలాగే వేడుకల వేళ సాంస్కృతిక కార్యక్రమాల ధూం ధాం జోరందుకుంటుంది. వార్షికోత్సవాలు నిర్వహిస్తూ., విజ్ఞాన యాత్రలకు తీసుకెళ్తున్నారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట విద్యార్థిని అర్చిత కళాఉత్సవ్ కార్యక్రమంలో జాతీయ స్థాయికి ఎంపికై ంది. అలాగే మెదక్ టీజీఆర్ఎస్ విద్యార్థిని శ్రీవాణి జాతీయ స్థాయి ఫుట్బాల్లో పోటీల్లో పాల్గొంది. ఇన్స్పైర్ పోటీల్లో పాపన్నపేట మండలం చీకోడ్ లింగాయపల్లి విదార్థులు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈయేడు పదో తరగతిలో తూప్రాన్ టీజీఆర్ఎస్ విద్యార్థి అభిలాష్ 586 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచాడు. 58 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్ రాహుల్రాజ్ ప్రతిభ అవార్డులు ప్రదానం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్ అందిస్తాం. నిష్ణాతులైన టీచర్లతో విద్యాబోధన చేయిస్తున్నాం. బాల్యం నుంచే ఇంగ్లిష్ మీడియం, ఏఐ(కృత్రిమ మేధ) పాఠాలు, డిజిటల్ విద్య, ఐఎఫ్పీ బోర్డుల ద్వారా మనస్సుకు హత్తుకునేలా పాఠ్యాంశాల వివరణ. ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ , మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రవాణా ఖర్చులు అందిస్తాం. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపండి..బాధ్యత మాది. స్థాయికి తగ్గ సామర్థ్యాలు అందిస్తాం. – రాధాకిషన్, డీఈఓ, మెదక్

సాహో.. సర్కారు బడి

సాహో.. సర్కారు బడి

సాహో.. సర్కారు బడి

సాహో.. సర్కారు బడి

సాహో.. సర్కారు బడి