
విద్యుదాఘాతంతో పాడి ఆవు మృతి
చేర్యాల(సిద్దిపేట): విద్యుదాఘాతానికి గురై పాడి ఆవు మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని నాగపురిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కాట తిరుపతికి చెందిన పాడి ఆవు మేత మేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. రూ.90వేల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వాపోయాడు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తికి తీవ్ర గాయాలు
దుబ్బాకటౌన్: ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రాయపోల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్కు చెందిన కిశోర్ రెడ్డి అతడి స్నేహితుడు వాసు నాయక్తో కలిసి దౌల్తాబాద్ నుంచి గజ్వేల్ వైపు వెళ్తుంన్నాడు. మార్గమధ్యలో రాయపోల్ జెడ్పీ ఉన్నత పాఠశాల దుర్గమ్మ గుడి మూలమలుపు వద్ద అతివేగంగా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
పాప ప్రాణం తీసిన కారు
వెనుక నుంచి ఢీకొట్టడంతో
అక్కడికక్కడే మృతి
నర్సాపూర్ రూరల్: అప్పటి వరకు అక్కాతమ్ముళ్లతో ఆడుకున్న పాప ప్రాణం రోడ్డు ప్రమాదంలో పోవడంతో కుటుంబ సభ్యుల రోదన అందరినీ కంటతడి పెట్టించింది. నర్సాపూర్ – తూప్రాన్ రహదారిపై హనుమంతపూర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిందం అర్చన (9) అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం... నర్సాపూర్కు చెందిన చిందం అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి హనుమంతపూర్ సమీపంలో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. సాయంత్రం తల్లి లలిత కూతురు అర్చనతో కలిసి నర్సాపూర్లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు కాలినడకన బయలుదేరారు. తూప్రాన్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు అర్చనను వెనుక నుంచి ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ఆ సందర్భంలో తల్లి కేకలు పెడుతూ బిడ్డను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు వదిలింది. అర్జున్ లలిత దంపతులకు నలుగురు సంతానం కాగా పెద్ద కూతురు ఉజ్వల, రెండో కూతురు అర్చన , రిషి, విశాల్ ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.