
ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
కొండపాక(గజ్వేల్): వ్యవసాయ పనులకు ట్రాక్టరు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు బోల్తాపడటంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారకర ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో సిర్సనగండ్ల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దేవిరెడ్డి బాపురెడ్డి (47) తన సొంత ట్రాక్టరును పొలం దున్నేందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో కాలువ పక్క నుంచి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఇంజిన్ కాలువలో బోల్తాపడింది. దీంతో ఆయన ఇంజిన్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు నెలల క్రితం బాపురెడ్డి కుమారుడు ఉదయ్ కుమార్రెడ్డి స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై దుద్దెడలో ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. ఈ క్రమంలో సిర్సనగండ్ల గ్రామ శివారులో డివైడర్ను ఢీకొట్టి కుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుమున్నాయి.
ట్రాక్టర్ ఢీకొని రైతు..
నారాయణఖేడ్: ట్రాక్టరు ఢీకొని రైతు మృతి చెందాడు. ఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి వివరాల ప్రకారం.. ఖేడ్ మండలం ర్యాకల్ గ్రామానికి చెందిన బాలయ్య(50) తన పొలం దున్నడానికి ట్రాక్టరును అద్దెకు తీసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన డ్రైవర్ బాగయ్య ట్రాక్టరుతో పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు బాలయ్యను ఢీకొట్టడంతో మృతి చెందాడు. వర్షాకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్న తరుణంలో అతడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.