
కిసాన్ మేళాలో రైతుల సందడి
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండో రోజు శనివారం కొనసాగిన కిసాన్ మేళాకు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చి సందడి చేశారు. స్టాళ్లలో ప్రదర్శించిన వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, చేపలు, డ్రోన్లు, ట్రాక్టర్లు తదితర వాటిని రైతులు ఆసక్తిగా పరిశీలించి, వినియోగం, ప్రయోజనాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
సోలార్ వినియోగంతో ఖర్చులు ఆదా
సోలార్ పవర్ నెట్మీటరింగ్ పద్ధతి అనుసరించడం ద్వారా వంద శాతం విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. సౌరశక్తి ఉత్పత్తి సహజ సిద్ధ నిరంతర ప్రక్రియే అయినప్పటికీ ప్రారంభ పెట్టుబడి ఉన్నప్పటికీ నిర్వహణ ఖర్చు తక్కువేనని పేర్కొన్నారు. మార్కెట్లోకి వస్తున్న అనేక రకాల విత్తనాల్లో మేలు రకమైన వాటిని గుర్తించాలని, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని పలు విత్తన స్టాల్స్ నిర్వాహకులు తెలిపారు. దీని నివారణకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్ధ రైతులకు అఽధిక దిగుబడినిచ్చే విత్తనాలను సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ మోటర్లు ఐఎస్ఐ మార్క్ ఉన్న వాటినే వినియోగించాలని కూడా సూచించారు. రాష్ట్రంలో చేనేత, మరమగ్గ కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత అభయహస్తం పథకం మంచి ఫలితాన్నిస్తుందన్నారు. చేనేత కార్మికుల ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేస్తుండటంతో వారికి ప్రయోజనం కలుగుతోందన్నారు.