
చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి
పాపన్నపేట(మెదక్): చేపల వేటకు వెళ్లి నీట మునిగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పొడిచన్పల్లి శివారులోని గండం చెరువులో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన భామిని బాలరాజు (29) చేపల వేటతో పాటు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మృగశిర కార్తె కావడంతో చేపలు పట్టి అమ్ముకుందామని తోటి వారితో కలిసి, గండం చెరువుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని నీటిలో మునిగిపోయాడు. అక్కడున్న వారు రక్షించే లోపలే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
వల చుట్టుకొని మత్య్సకారుడు..
నర్సాపూర్ రూరల్: మత్య్సకారుడు చేపల వేటకు వెళ్లి వల చుట్టుకొని మృతి చెందాడు. ఈ ఘటన నర్సాపూర్ రాయరావు చెరువులో జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దుద్దాల యాదగిరి (45) శనివారం సాయంత్రం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి వల చుట్టుకొని మృత్యువాతపడ్డాడు. ఆదివారం మృగశిర కార్తె కావడంతో చేపలు పట్టుకు వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లినట్లు మృతుడి భార్య రాంబాయి తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి