
అక్క ఇంట్లో వేడుకకు వచ్చి..
● కారు ఢీకొనడంతో తమ్ముడు మృతి ● తుక్కాపూర్లో ఘటన ● ఆందోళనకు దిగిన బంధువులు
తొగుట(దుబ్బాక): అక్క ఇంట్లో జరుగుతున్న వేడుకకు వచ్చి తమ్ముడు మృత్యువాత పడిన విషాద ఘటన మండలంలోని తుక్కాపూర్లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎల్లారెడ్డిపేటకు చెందిన గంట కనకయ్య (34) తుక్కాపూర్లో తన అక్క దర్గవ్వ ఇంట్లో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మ పండుగకు ఉదయం వచ్చాడు. సాయంత్రం భోజనాల తర్వాత బయటకు వెళ్లిన కనకయ్య తిరిగి ఇంటికి వస్తుండగా వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కనకయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అయితే కారులోని గుర్తు తెలియని యువకుడు కనకయ్య మృతదేహాన్ని సమీపంలోని ఓ ఇంటి ముందు ఉంచి అక్కడి నుంచి కాన్గల్ గ్రామం వైపుకు వెళ్లాడు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న కొందరు అప్రమత్తమై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. మృతుని అక్క దర్గవ్వ, భావ మైసయ్యతో పాటు బంధువులు అక్కడి చేరుకుని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తొగుట సీఐ అప్రమత్తమై పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. తన తమ్ముడికి న్యాయం జరిగే వరకు శవాన్ని ఇక్కడి నుంచి కదిలించబోమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. కారులో పెద్ద ఎత్తున మద్యం తరలిస్తున్నారని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. మద్యం సేవించి కారు నడిపి తన తమ్ముడి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

అక్క ఇంట్లో వేడుకకు వచ్చి..