
ఆ సీటు మాకొద్దు బాబోయ్!
నీటి పారుదల శాఖ ఎస్ఈ పోస్టుపై అధికారుల అనాసక్తి
● బాధ్యతలిస్తే సెలవుపెడతానంటున్న ఓ అధికారి
● ఏసీబీ దాడులు.. రాజకీయ ఒత్తిళ్లే కారణమా?
● సీఈ ధర్మపై ఇటీవల వేటు వేసిన ప్రభుత్వం
రాజకీయ ఒత్తిళ్లే కారణమా?
నీటిపారుదలశాఖ అధికారులపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. ప్రధానంగా చెరువులు, కుంటలకు ఎన్ఓసీల జారీల విషయంలో నేతల నుంచి ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయి. మరోవైపు చెరువుల్లో మట్టి తవ్వకాల అనుమతుల కోసం కూడా ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్లు వస్తుంటాయి. మరోవైపు సంగారెడ్డి చీఫ్ ఇంజనీర్ ధర్మపై ఇటీవల బదిలీవేటు పడిన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి కీలకమైన ఎస్ఈ పోస్టులో పనిచేసేందుకు ఆ శాఖ అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అలాగే గుమ్మడిదల ఏఈగా పనిచేస్తున్న అధికారిని ఇటీవల ఏసీబీ ట్రాప్ చేసింది. ఓ నిర్మాణానికి ఎన్ఓసీ జారీ విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏఈని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇలా నీటిపారుదల శాఖలో అధికారుల తీరు చర్చనీయాంశంగా మారుతున్న తరుణంలో ఎస్ఈ పోస్టులోకి వచ్చేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న అధికారులకే ఈ బాధ్యతలు ఇస్తారా..? లేదా పక్క జిల్లాలో పనిచేస్తున్న అధికారిని ఇక్కడి ఎస్ఈగా నియమిస్తారా? అనేది కొద్దిరోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : నీటి పారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ)గా పనిచేసేందుకు ఆ శాఖ అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఈ సీటు మా కొద్దు బాబోయ్ అంటే మాకొద్దని ఇన్చార్జి బాధ్యతలు తీసుకునేందుకు ముఖం చాటేస్తున్నారు. దీంతో వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఈ పోస్టులో ఏ అధికారికీ ఇన్చార్జి బాధ్యతలు గానీ, ఎఫ్ఏసీగానీ ఇవ్వలేదు. ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన ఏసయ్య ఐదు రోజుల క్రితం (మే 31)న పదవీ విరమణ చేసిన విషయం విదితమే. దీంతో ఈ పోస్టు ఖాళీ అయింది. ఇప్పటివరకు ఈ పోస్టులో ఎవరినీ నియమిస్తూ ఉత్తర్వులు రాలేదు. ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న అధికారికి ఇన్చార్జిగా నియమించాలని భావించారు. కానీ, ఆయన కూడా పోస్టులో పనిచేసేందుకు ఆసక్తి చూపలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బాధ్యతలు ఇస్తే సెలవుపై వెళ్లిపోతానని సదరు అధికారి తేల్చి చెప్పినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సంగారెడ్డి సీఈ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పోస్టులో ఉన్న అధికారి పేరు ఎస్ఈ పోస్టుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ, ఆశాఖ ఈఎస్సీ కార్యాలయం ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో వివిధ డివిజన్లలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో సంగారెడ్డి, నారాయణఖేడ్ డివిజన్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లలో ఒకరికి ఈ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇందులో ఓ ఈఈ ఇప్పటికే హైదరాబాద్కు బదిలీ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎస్ఈ పోస్టులో ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
కొనసాగుతున్న సింగూరు కాలువల పనులు
ఎస్ఈ కార్యాలయం పరిధిలో మొత్తం నాలుగు డివిజన్లు ఉన్నాయి. సంగారెడ్డితోపాటు, జహీరాబాద్, నారాయణఖేడ్, దౌల్తాబాద్ డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుతం నీటి పారుదల శాఖలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సింగూరు కాలువల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.200 కోట్లతో ఈ కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేస్తున్నారు. మరోవైపు సంగమేశ్వర, బసవేశ్వర పనులు గత ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు ఉండగా ప్రస్తుతానికి ఈ రెండు ఎత్తిపోతల పథకాల పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి. మరోవైపు వర్షాకాలం ప్రారంభమైంది. ఈ పనులను ఎస్ఈ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో ఎస్ఈ పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది.