
రైతు మహోత్సవానికి రారండి..
రేపటి నుంచి హుస్నాబాద్లో కిసాన్ మేళా●
● మేళాను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హుస్నాబాద్: రైతు మహోత్సవం సందర్భంగా కిసాన్ మేళాను హుస్నాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తు న నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 6, 7, 8వ తేదీల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులో మేళా నిర్వహించనున్నారు. వివిధ రకాల వ్యవసాయ యంత్రాలపై అవగాహన కోసం స్టాళ్లను ఏర్పాటు చేశారు. మొదటి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు కలిసి మేళాను ప్రారంభించనున్నారు. వీరితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు హాజరుకానున్నారు.
108 స్టాళ్లు..
కిసాన్ మేళాలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖ విభాగాలు, బ్యాంకులు, ఎఫ్పీఓలు, స్టార్టప్ కంపెనీలు, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రైవేట్ కంపెనీలకు సంబందించిన 108 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయ పరికరాలు, డ్రోన్లు, రోబొటిక్ యంత్రాలు, సేంద్రియ ఎరువులు, ఫైస్టిసైడ్, హార్టికల్చర్, సెరికల్చర్, ఆయిల్పామ్, వివిధ రకాల పంటల విత్తనాలను ప్రదర్శిస్తారు. కొత్త పద్ధతులు, సాగు ఖర్చు తగ్గించే విధానాలు, వివిధ పంటలల్లో అధిక దిగుబడులకు పాటించాల్సిన మెలకువలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు.
సద్వినియోగం చేసుకోండి
మూడు రోజుల పాటు జరిగే కిసాన్ మేళా కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వివిధ రకాల విత్తనాలు, ఆధునిక పరికరాల ప్రదర్శన ఉంటుంది. రోజూ వివిధ శాఖల అధికారులతో వర్క్షాపుతోపాటు శాస్త్రవేత్తల ద్వారా ముఖాముఖి నిర్వహిస్తున్నాం. ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పిస్తాం. రైతులను తరలించడానికి ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించాం.
– రాధిక, జిల్లా వ్యవసాయ అధికారి