
ఆరు గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలు
మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి జోన్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను నిష్పక్షపాతంగా, అర్హులైన వారికి పూర్తిస్థాయిలో అమలు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. జిల్లా పరిషత్తు కార్యాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై జిల్లా కలెక్టరు వల్లూరు క్రాంతితో పాటు వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..విద్యుత్ వినియోగంలో నిర్దిష్ట పరిమితికి లోబడి వినియోగించిన కుటుంబాలకు విద్యుత్ బిల్లును మాఫీ చేయాలన్నారు. మహిళా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, గ్యాస్ కనెక్షన్లపై అందించే రాయితీలను సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. పేదలకు సన్నబియ్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. పక్కా ఇల్లు ప్రతీ కుటుంబానికి ఉండాలన్న లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం పథకం యువతను సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే దిశగా ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం అర్హులైనవారికి వెంటనే సేవలు అందించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్తు సీఈఓ జానకీరెడ్డి, వివిధ శాఖల అధికారులు జ్యోతి, జగదీశ్, చలపతిరావు, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.