
బాలికా విద్యకు.. మరింత భరోసా
ఏడు కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు ప్రారంభం
● 360 మంది బాలికలకు ప్రయోజనం
● సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థినులు
న్యాల్కల్(జహీరాబాద్): విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ప్రై వేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆంగ్ల మాధ్యమంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. సక్సెస్ పాఠశాలల మాదిరిగా కేజీబీవీలో ఇంటర్ విద్యతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం తల్లిదండ్రులు ఆంగ్ల బోధన వైపు మొగ్గు చూపుతుండటంతో పాటు ఆడ పిల్లల విషయంలో భద్రతను కూడా కోరుకుంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు జిల్లాలోని 7 కేజీబీవీలను ఇంటర్(ఆంగ్ల మాధ్యమం) వరకు ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది.
ఎలిమెంటరీ స్థాయి నుంచే బాలికలకు విద్య నందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2004లో జాతీయ విద్యా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కాని ఆ కార్యక్రమం వల్ల సరైన ఫలితాలు రాలేవు. దీంతో బాలికలకు పూర్తి స్థాయి విద్య నందించేందుకు సిబ్బందితో కూడిన హాస్టల్ వసతి సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం కేజీబీవీలను ప్రారంభించింది. మధ్యలోనే చదువులకు స్వస్తి చెబుతున్న బీద కుటుంబాలతో పాటు ఆర్థికంగా వెనుబడిన వర్గాలకు చెందిన (ఎస్సీ, ఎస్టీ, బీసీ) చెందిన బాలికల కోసం మండలానికి ఒకటి చొప్పున మొదట సంగారెడ్డి జిల్లాలో 17 కేజీబీవీలను ఏర్పాటు చేసింది. మూడేళ్ల క్రితం మరో ఐదు కేజీబీవీలకు శ్రీకారం చుట్టింది.
విద్యనభ్యసిస్తున్న 5వేల మంది
ఆరో తరగతి నుంచి 10వ వరకు గల విద్యాలయాల్లో 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన బాలికలకు, మిగతా 25 శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రవేశం కల్పిస్తున్నారు. ఆయా విద్యాలయాల్లో సుమారు 5వేల మంది బాలికలు చదువుకుంటున్నారు. జిల్లాలో నాగిల్గిద్ద కేజీబీవీలో 8వ తరగతి వరకు, మొగుడంపల్లి, గుమ్మడిదల, చౌటకూర్లో 9వ తరగతి వరకు ఉంది. అందోల్, నారాయణఖేడ్, కొండాపూర్, ఝరాసంగం, రాయికోడ్, సదాశివపేట్, సిర్గాపూర్, సుల్తాన్పూర్, జిన్నారం, హోతి(కె) కేజీబీవీల్లో ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి.
ఏడు కేజీబీవీల్లో ఇంటర్ వరకు..
ఈ విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని న్యాల్కల్, అత్నూర, కంగ్టి, కాశీంపూర్, తాట్పల్లి, హుస్మాన్ నగర్, పుల్కూర్తి ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అప్గ్రేడ్ చేసిన విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుందని అధికారులు తెలిపారు. రెండు కేజీబీవీల్లో రెండు గ్రూప్లు(ఎంపీసీ, బైపీసీ) గ్రూప్నకు 40 మంది చొప్పున 160 మంది, మిగిలిన విద్యాలయాల్లో ఎంఎల్టీలో గ్రూప్కు 40 చొప్పున 200 మంది బాలికలకు అడ్మిషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. కేజీవీబీల్లో 10వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇంటర్ వరకు అప్గ్రేడ్ పొందిన విద్యాలయాల్లో అధ్యాకుల నియామకానికి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు.
సంతోషంగా ఉంది
10వ తరగతి వరకు ఉన్న విద్యాలయాన్ని ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం సంతోషంగా ఉంది. పదో తరగతి పూర్తయిన తర్వాత బయటకు వెళ్లి చదువుకోవాలంటే ఆర్థికంగా కష్టం. ఇక్కడే ఇంటర్మీడియెట్ వరకు చదువుకునేందుకు అవకాశం కల్పించడం బాలికలందరికీ వరం.
– మేరీ, విద్యార్థిని, కేజీబీవీ, న్యాల్కల్
సిబ్బందిని త్వరలోనే నియమిస్తాం
జిల్లాలో ప్రస్తుతం 10 కేజీబీవీల్లో ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. కొత్తగా ఏడు కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. బోధనా సిబ్బందిని త్వరలోనే నియమిస్తాం. తరగతులు త్వరలో ప్రారంభమవుతాయి.
– వెంకటేశ్వర్లు, డీఈఓ, సంగారెడ్డి